1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (08:14 IST)

లాడెన్ కుమారుడు హంజాబిన్ హతం

అల్ ఖైదా అగ్ర నాయకుడు, ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ ను అమెరికా మట్టుబెట్టింది. లాడెన్ హత్యానంతరం వారసత్వంగా అల్ ఖైదా చీఫ్‌గా హంజాబిన్ లాడెన్ వ్యవహరించేవాడు. హంజాబిన్ అల్ ఖైదా కార్యకలాపాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో అతని ఆచూకీ చెప్పినా, అతన్ని పట్టించిన వారికి భారీ రివార్డు ఇస్తామని గతంలో అమెరికా ప్రకటించింది.

హంజాబిన్ లాడెన్ తలపై అమెరికా మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. హంజా ఎక్కడ హత్యకు గురయ్యాడు? అనే విషయం మాత్రం అమెరికా వెల్లడించకుండా రహస్యంగా ఉంచింది. హంజాబిన్ లాడెన్ చివరిసారిగా 2018లో మీడియాకు విడుదల చేసిన వీడియోలో సౌదీఅరేబియాను బెదిరించారు. ఒసామాబిన్ లాడెన్ కు ఉన్న ముగ్గురు భార్యలు పాకిస్థాన్ లోని అబోత్తాబాద్ ఇంట్లో నివాసమున్నారు.

అబోత్తాబాద్ ఇంట్లో దాడి జరిపినపుడు హంజాబిన్ లాడెన్ (29) కనిపించలేదు. లాడెన్ ను 2011లో అమెరికా నావికాదళం పాకిస్థాన్ దేశంలోని అబోత్తాబాద్ రహస్య స్థావరంలో ఉండగా పట్టుకొని హతమార్చింది. అప్పట్లో ఆ దాడి నుంచి హంజాబిన్ లాడెన్ తప్పించుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. గతంలో హంజాబిన్ లాడెన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేశాడు.

దీంతో  అమెరికా హంజాబిన్ లాడెన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి, అతని ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టింది. హంజా బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింప జేసింది. నాటి నుంచి హంజాబిన్ కోసం అమెరికా వేటాడుతూనే ఉంది. ఎట్టకేలకు అమెరికా ప్రయత్నం ఫలించిందని, అతన్ని హతమార్చామని ముగ్గురు అమెరికా అధికారులు ధ్రువీకరించారు.