శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (21:26 IST)

ఆంధ్రాబ్యాంకును కాపాడుకుందాం.. సీపీఐ

ఆంధ్రా బ్యాంకును కాపాడుకోవటంతో పాటుగా, బ్యాంకుల విలీనాన్ని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరు కదిలి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ నెల 28 న చేపట్టిన చలో విజయవాడ పేరిట చేపట్టిన నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రా బ్యాంక్ విలీనీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ర్యాలీకి శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మద్దతు తెలియచేయాలని కోరారు. అయితే సీపీఐ చేపట్టిన ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జీడీపీ వృద్ధి ఆరు శాతం కంటే తక్కువగా ఉన్న రోజున కేంద్రం బ్యాంకుల విలీనం ప్రకటించటం ప్రజలను దారి మళ్లించేందుకేనని విమర్శించారు. దేశంలో ఉన్న బ్యాంకులను 12 బ్యాంకులుగా మార్చేందుకు రోడ్డు మ్యాప్ సిద్ధమైందని చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఏ రోజు విలీనాన్ని అమలోకి తీసుకొస్తామని చెప్పలేదని వ్యాఖ్యానించారు.

బ్యాంకుల విలీనం నిర్ణయం సరైనది కాదని, ఇది తప్పుడు నిర్ణయమని, బ్యాంకులను విలీనం చేయటం అంటే బ్యాంకులను హత్య చేయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ చేయబడ్డాయని అన్నారు. బ్యాంకులు ఈ విధంగా మూతపడితే ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తుందని అన్నారు.

96 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రా బ్యాంక్ ను యూనియన్ బ్యాంకులో విలీనం చేయటం అంటే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కించపరిచటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమ నేత శ్రీ బోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన బ్యాంకు అన్నదాతలకు అండగా నిలిచిన బ్యాంకు ఆంధ్రా బ్యాంక్ అని కొనియాడారు.

1923 నవంబర్ 20న ఆంధ్రాబ్యాంకు ను లక్ష రూపాయల మూల ధనంతో ప్రారంభించారని చెప్పారు. అప్పటి వరకు బ్యాంకులంటే ధనవంతులకే అణా అపోహను ఆంధ్రాబ్యాంకు స్థాపనతో పటాపంచలు చేశారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సేవలు అందించి, రెండువేల శాఖలగా ఆంధ్రా బ్యాంకు విస్తరించి ఉందన్నారు.

ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునేందుకు బ్యాంకుల విలీనాన్ని పక్కన పెట్టి ఆంధ్రాబ్యాంకును మాత్రమే విలినీకరణ చేసే ఆలోచన చేయటం తగదన్నారు.ఆంధ్రా బ్యాంకు ను పరిరక్షించుకోవటానికి ప్రజలతో, కార్మికులతో, కర్షకులతో, ఉద్యోగులతో, మేధావులతో, ఇతర ప్రజా సంఘాలతో ఐక్యంగా ముందుకు సాగి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న సీపీఐ ఛలో విజయవాడ పేరిట నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు,  రాజకీయలకి అతీతంగా తరలిరావాలని కోరారు.

ప్రజా సంక్షేమం కోసం తమ ఉద్యమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శితో పాటు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాధ్ రెడ్డి పాల్గొన్నారు.