1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , బుధవారం, 11 ఆగస్టు 2021 (20:43 IST)

తహసీల్దారు పక్కన ఉంటే నీ శీలం బాగైపోతుందా కాకాణీ?

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ పై నెల్లూరు టీడీపీ నేత‌లు వివాదాస్ప‌ద కామెంట్ చేశారు. కంటేపల్లి పరిధిలో పీఓబీలో ఉన్న అటవీ భూమిలోకి తహసీల్దారును వెంట తీసుకెళ్లి శీల పరీక్ష చేసుకునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉంద‌ని ఎద్దేవా చేశారు.

జిల్లా కలెక్టరేట్ ఆవరణలో టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఈ కామెంట్స్ చేశారు. అసలు మీ అనుచరులే మాఫియాగా ఉంటే, టీడీపీ నేతలే మైనింగ్ చేస్తున్నారని అంటున్నారు. వారు టీడీపీ నాయకులే అయితే ఇప్పుడే కేసు పెట్టండి.. ఎందుకు పెట్టడం లేద‌ని ప్ర‌శ్నించారు.

దళితుల ఇళ్లపై కరెంట్ వైర్లు పడితే ఎమ్మెల్యే ఆదేశాలతో తిరిగి ఆ బాధితులనే పోలీసు స్టేషన్ లో పెడతారా...ఇది నిజంగా అట్రాసిటీనే..అని పేర్కొన్నారు. ఒకే కాంట్రాక్టరు రెండు సార్లు అక్రమంగా తవ్వకాలు చేస్తూ దొరికిపోతే, ఎమ్మెల్యేగా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిపోయి మాఫియాకు అండగా నిలవడం దుర్మార్గం అని అన్నారు.

కాంట్రాక్టర్ ను వెనకేసుకుని వస్తూ, రైతులే మట్టి అమ్ముతున్నారని చెప్పడం చాలా అన్యాయమైన విషయం అని విమ‌ర్శించారు. ఎమ్మెల్యేగా పోలీసు స్టేషన్ కు వెళ్లి దళితులకు అండగా నిలవాల్సిందిపోయి, కాంట్రాక్టర్ కు అండగా నిలుస్తారా..ఇదెక్కడి న్యాయం? అటవీ శాఖకు సంబంధించిన నిషిద్ధ భూమిలో అర్థరాత్రి అక్రమంగా మట్టి తోలుకెళ్లే అధికారం మీకు ఎవరిచ్చారు? అని ప్ర‌శ్నించారు.

మీ పక్కన ఉన్న తహసీల్దారుపై ప్రైవేటు కేసు వేయబోతున్నాం... నిషిద్ధ అటవీ భూమిలో ఆయన వచ్చి అక్రమ తవ్వకాలను సమర్ధించడం విచిత్రంగా ఉంది..మరీ ఇంత బరితెగింపా? అని ప్ర‌శ్నించారు. అధికారులు కూడా మాఫియాతో కలిసిపోయిన భావన కల్పిస్తున్నారు. ఎక్కడ బడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రజలకు ద్రోహం చేస్తారా.. అన్యాయంగా వ్యవహరిస్తున్న అధికారులను ఎవరూ రక్షించలేరు...వైసీపీ నాయకులు కూడా మిమ్మల్ని కాపాడలేర‌ని హెచ్చ‌రించారు.