ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 7 అక్టోబరు 2021 (17:17 IST)

సివిల్ సప్లయ్ ముఠా కార్మికుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని నిరాహార దీక్ష‌

క‌ర్నూలు జిల్లా నంద్యాలలోని సీడబ్ల్యూసీలో పనిచేసే 112 మంది కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా. రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. నాగరాజు ప్రారంభించారు. దీక్షలలో వెంకటరమణ బ్యాచ్ లో పనిచేస్తున్న 30 మంది హమాలీ కార్మికులు పాల్గొన్నారు. సిఐటియు కోశాధికారి వెంకట లింగం నాయకులు జైలాన్, యూనియన్ నాయకులు రామకృష్ణ,శివలింగం,వెంకటరమణ,పరమేష్ ,మద్దిలేటిలతో పాటు వంద‌ల మంది కార్మికులు మ‌ద్ద‌తు తెలిపారు.  
 
ఈ దీక్షలను ఉద్దేశించి సి ఐ టి యు జిల్లా  ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ లు మాట్లాడుతూ, కాంట్రాక్టర్ల లాభాల కోసమే సివిల్ సప్లయ్ అధికారులు  బియ్యం ప్రైవేట్ గోడౌన్ లకు తరలించ‌డం సరైంది కాదన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడానికి ప‌నిచేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. వేగవంతంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు సంస్థల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దానిలో భాగంగానే సీడబ్ల్యూసీలో గత 30 సంవత్సరాల నుంచి నిల్వ ఉంచుతున్న బియ్యంను, గత 7నెలల నుండి ప్రైవేట్ గొడౌన్ లకు తరలింస్తున్నారని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 15 కిలోమీటర్ల రవాణా చార్జీలు అదనపు భారం అవుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై లాభాలను అర్జిస్తూ, ప్రైవేటు గోడౌన్లలో బియ్యం నిల్వ ఉంచేలా చూస్తున్నాని చెప్పారు. 
 
జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు లక్షలలో డబ్బును ముట్టజెపుతున్నారని, దీనివల్ల హమాలీలకు పనులు లేకుండా చేస్తున్నారని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర సివిల్ సప్లై మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండ్యన్ కి, కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావుకి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి కి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ దీక్షలు నాలుగు రోజుల పాటు కొనసాగి అనంతరం జిల్లాలో ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి వరకు పాద‌యాత్ర చేసి మంత్రి ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. అదేవిధంగా నంద్యాల సిడబ్ల్యుసిలో ఉన్న రెండు గొడౌన్ లను రిలయన్స్ సంస్థ లీజుకు తీసుకున్నదని,  ఈ గోడౌన్ లలో ఎగుమతి, దిగుమతి జరిగే వాటిని హమాలీలకు పని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 
టిడిపి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి దీక్షలను సందర్శించి మద్దతుగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు  వారి సేవలో తరిస్తున్నదని, కార్మికులను, కార్మికుల కుటుంబాలను రోడ్డున పడే విధంగా చేపట్టే చర్యలను టిడిపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రాబోయే కాలంలో సిడబ్ల్యుసి హమాలీ కార్మికులకు పని కల్పించుకుంటే ప్రత్యక్ష ఆందోళనే టిడిపి చేపడుతుందని, అధికారులు ఇప్పటికైనా ప్రైవేట్ గొడౌన్లకు బియ్యం తరలింపును ఆపి ప్రభుత్వం గోడౌన్  అయినటువంటి సీడబ్ల్యూసీ లోనే నిల్వ ఉంచాలని డిమాండు చేశారు.