1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (13:59 IST)

బహరైన్ నుంచి శ్రీకాకుళం తిరిగి వ‌చ్చిన‌ వ‌ల‌స కార్మికులు

బహరైన్ లోని ఎన్.హెచ్.ఎస్. సంస్థలో పనిచేస్తున్న 13 మంది వలస కార్మికులు ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏపీ భవన్ అధికారులు వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుండి రైల్ ద్వారా బయల్దేరి, వారి స్వస్థలమైన శ్రీకాకుళం చేరుకుంటారు. మొదటి దశలో 20 మంది వలస కార్మికులు ఏపీఎన్ఆర్టిఎస్ సహకారంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరారు.
 
వారిని  ఏపీఎన్ఆర్టిఎస్ సిబ్బంది హైదరాబాద్ నుండి విజయవాడకు బస్సు ద్వారా తీసుకువ‌చ్చారు.  విజయవాడలో వారికి వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి, వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వరకు  వాహన సదుపాయం కల్పించడం జరిగింది. రైల్వే స్టేషన్ నందు ఏపీఎన్ఆర్టిఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్. మేడపాటి, సీఈ ఓ శ్రీ. కె. దినేష్ కుమార్ వారికి ధైర్యం చెప్పి వారి సొంత గ్రామాలకు చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసి వారిని పంపించారు. 
 
వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు బహ్రెయిన్ లోని  ఎన్.హెచ్.ఎస్. సంస్థలో ఉపాధి నిమిత్తం వెళ్లగా, వారు పనిచేసే ప్రదేశంలో ఇబ్బందులకు గురై అక్కడ చిక్కుకుపోయారు.  ఈ విషయమై గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే రాష్ట్రానికి చెందిన వారిని స్వదేశానికి తీసుకురావడానికి సహకరించమని  కేంద్ర విదేశీవ్యవహారాల శాఖామంత్రి జైశంకర్ని  13.09.2021న  లేఖ ద్వారా కోరారు. అలాగే, ఈ విషయంలో విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోమని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంకట్ ఎస్. మేడపాటి అదే రోజున ఇబ్బందులకు గురవుతున్న వారి అభ్యర్థనను పూర్తి వివరాలతో బహరైన్ లోని భారత రాయబార కార్యాలయానికి ఇమెయిల్ ద్వారా పంపారు. 
 
 ఏపీ భవన్ మరియు ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులు బహారైన్లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరాయంగా సంప్రదింపులు జరిపారు. రాయబార కార్యాలయ అధికారులు  ఎన్.హెచ్.ఎస్. పని ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితులు, కార్మికులకు అందిస్తున్న వసతి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం  ఎన్.హెచ్.ఎస్. యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఎవరైతే వారి స్వదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారిని పంపించడానికి తగు ఏర్పాట్లు చేసారు. ఈ ప్రక్రియ మొత్తంలో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఢిల్లీలోని ఏపీ భవన్ మరియు ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులు సకాలంలో అవసరమైన చర్యలు తీసుకొని ఎవరైతే స్వదేశానికి రావాలనుకుంటున్నారో వారిని స్వస్థలాలకు తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు.
 
దినేష్ కుమార్  మాట్లాడుతూ రానున్న రోజుల్లో విడతల వారీగా రాష్ట్రానికి చెందిన కార్మికులు వారి స్వస్థలాలకు చేరుకోవడంలో ఏపీఎన్ఆర్టీఎస్ తగు సహకారం అందిస్తుందన్నారు. అయితే, విదేశాలకు వెళ్లేముందు ధ్రువీకరించబడిన నియామక  ఏజెంట్ల ద్వారా వెళ్ళాలని, ఉపాధి కోసం వెళ్ళే సంస్థ గురించి పూర్తిగా తెలుసుకొని వెళ్ళడం మంచిదని సూచించారు. విదేశాలకు వెళ్లేవారికి ఏపీఎన్ఆర్టీఎస్ అనేక సేవలందిస్తోందని, 24/7 హెల్ప్ లైన్ ను సంప్రదించగలరని అన్నారు.  
 
బాధిత కార్మికులు మాట్లాడుతూ నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని, వారు ఉపాధి కల్పిస్తామనగానే ఆయా దేశాలకు వెళ్ళకుండా అది నిజామా, కాదా అన్న విషయాన్ని మనకోసం పనిచేసే ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా తెలుసుకొని వెళ్ళడం మంచిదని చెబుతూ  తమ పని ప్రదేశంలో వారు అనుభవించిన కష్టాలను వివరించారు. విదేశంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న తమని వెంటనే స్వదేశానికి తీసుకురావటానికి తగు ఏర్పాట్లు చేసిన ముఖ్యమంత్రి  వై.ఎస్ జగన్ మోహన్  రెడ్డికి, పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు, ఏపీఎన్ఆర్టిఎస్ ప్రెసిడెంట్ వెంకట్ ఎస్. మేడపాటికి, సీఈఓ  కె. దినేష్ కుమార్ కి  హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.