1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (06:53 IST)

కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిందే: ఎస్ఈసీకి అఖిలపక్షం స్పష్టీకరణ

రాష్ట్రంలో గతంలో ప్రకటించిన స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని వివిధ రాజకీయపార్టీల నేతలు డిమాండు చేశారు. ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో ఈ ఏడాది మార్చిలో వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.

దీనిలో భాగంగా ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బుధవారం అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశానికి అధికార పార్టీ వైసీపీ మినహా దాదాపు అన్ని పార్టీలు హాజరయ్యాయి. స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో తమ అభిప్రాయాలను ఎస్‌ఈసీకి స్పష్టం చేశాయి.

ఇందులో కొంత మేర భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. మెజారిటీ పార్టీలు గతంలో జరిగిన ఎన్నికలు దౌర్జన్యపూరిత వాతావరణంలో జరిగినందున, ఆసందర్భంగా ఏకగ్రీవస్థానాలతోపాటు, మొత్తం పాత్ర ప్రక్రియను రద్దు చేసి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరాయి.
 
వ్యక్తిగత సంప్రదింపులు అన్నింటికంటే ఉత్తమం- ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల అభిప్రాయాలను తెల్సుకున్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. సమావేశానికి మొత్తం 11 పార్టీలు హాజరు కాగా, మరో మరో 2 పక్షాలు మాత్రం లిఖితపూర్వక సమాధానాలు పంపినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌తో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు.

సంప్రదింపుల ప్రక్రియలో వచ్చిన ఏకాభిప్రాయాలను, అభిప్రాయాలను గౌరవించాలని కమిషన్‌ కోరుకుంటుందని, దీనిని ఉత్తమమైన పద్దతిగా భావిస్తున్నట్లు నిమ్మగడ్డ చెప్పారు.