గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (07:20 IST)

శాశ్వత రాజధాని అమరావతి కోసం ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధం: అఖిల పక్ష సమావేశం

శాశ్వత రాజధాని అమరావతి కోసం అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించే ఎటువంటి ఉద్యమానికైనా తాము సిద్ధమని పలు రాజకీయ పార్టీల నేతలు, పౌర సంఘాల నేతలు, కార్మిక, కర్షక, వర్తక సంఘాల ప్రతినిధులు అఖిల పక్ష సమావేశంలో ప్రకటించారు.

రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ ఉద్యమం ప్రారంభమై 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఉదమ్య కార్యాచరణ ప్రణాళిక కోసం అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని మినర్వా గ్రాండ్ నందు అఖిల పక్ష సమావేశం మంగళశారం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తొలుత అమరావతి పరిరక్షణ సమితి జెఎసి కన్వీనర్ ఎ.శివారెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో ఐక్య కార్యాచరణ ఏర్పడి ఉద్యమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో రాజధానిగా అమరావతి ఉండాలనే నిర్ణయాన్ని బలంగా తీసుకువెళ్లారన్నారు.

ఇంత పెద్ద స్థాయిలో ఉద్యమం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఎంతో మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చి ప్రాణాలు సైతం అర్పించినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రులు, శాసనసభ్యులు ఎవరూ కూడా ఉద్యమం చేస్తున్న మహిళలను, రైతులను పరామర్శించిన పాపాన పోలేదని, విజయవాడలో రాజధాని కోసం పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా మహిళలను అరెస్టులు చేసి నిర్భందించారని అయినా కూడా ఉద్యమం ఆగలేదన్నారు.

ప్రస్తుతం 294 రోజులు పూర్తయి 300 రోజుకు చేరుకుంటుంటున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటుచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని రాజకీయపార్టీలు, వివిధ సంస్థలతో ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశంలో తీర్మాణాలు ఉద్యమం 300 రోజులు పూర్తి అవువతున్న సందర్భంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు .

ఈ నెల 11 వ తేదీన ( ఆదివారం ) రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అమరావతి పరిరక్షణ నిరసన ర్యాలీ ( 5 కె వాక్ ) ఉదయం 6 నుండి 8 గంటలలోపు అనంతర వెబ్ నార్ ( సదస్సు ) నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 వ తేదీ ( సోమవారం ) రాష్ట్ర వ్యాపితంగా అన్ని రెవిన్యూ కార్యాలయాల ముందు నిరసనలు తెలపాలని నిర్ణయించారు. 
 
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాజధాని ఉద్యమం 294 రోజులు పూర్తిఅవ్వడం నైతికంగా గొప్ప విజయాన్ని సాధించినట్లు తెలిపారు. ప్రస్తుత అమరావతికి ఇటువంటి దుస్థితి రావడానికి కారణం కేంద్రంలోని కొంత మంది పెద్దలని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో మేము పూలింగ్ ను వ్యతిరేకించాము కానీ అప్పట్లో మమ్మల్ని నిర్భందము చేశారన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని , అమరావతి ఉద్యమానికి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.  
 
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ మన రోపాటం ప్రభుత్వం మీద కాదని ఒక వ్యక్తి మీద అనేది గమనించాలన్నారు. అహంకారం రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిపై మనం పోరాటం చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే చంద్రబాబు గుర్తుకు వస్తున్నాడని, దళితుల నోట్లో మట్టి కొట్నీ జగన్ కు వారి ఉసురు తగులుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నారన్నారు.

పలికిమాలిన సలహాదారులు సజ్జల రామకృష్ణ బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు . బహుజన, బలహీన వర్గాలు వారిని ఎందుకు తొక్కుతున్నారని, ఇందుకా మీకు ఓటు వేసి గెలిపించిందని జగన్ ప్రశ్నించారు.
 
జనసేన అదికార ప్రతినిధి పోతిన మహేష్ మాట్లాడుతూ తమ పార్టీ మొదట నుండి అమరావతి రాజధానిగా ఉండాలని ఆకాంక్షిస్తుందని, అమరావతికి మద్దతుగా జనసేన తరపున ఈనెల 12 వ తేదీన విజయవాడ, గుంటూరులో సామూహిక చేపడుతుందన్నారు. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసమే వికేంద్రీకరణ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 
 
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ అమరావతిగా ఉంటనే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని, ఇటీవల డిల్లీ వెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుకు, రాహుల్ గాంధీకి రాజధాని ఉద్యమం గురించి వివరించినట్లు తెలిపారు. రాజధానిగా అమరావతి ఉండాలని త్వరలోనే రాహుల్ గాంధీ ప్రకటన చేయనున్నారని తెలిపారు. కోవిడ్ కారణంగా ప్రజలలోకి వెళ్లలేక పోయామని ఇక నుండి బహిరంగంగా ప్రజల్లోకి, రోడ్లపైకి వెళ్లి ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు.  

అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటిలంచాలన్నారు. రానున్న కాలంలో ఉద్యమం పెద్ద ఎత్తున నిర్వహించాలంటే ఆర్థికంగా నిలతొక్కుకోవాల్సి ఉంటుందని దీనికి సంబంధించి తగిన విధంగా తాను సహకారం అందించనున్నట్లు తెలిపారు. 
 
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రాజధానలుగా ప్రకటించి చరిత్రలో పెద్ద తప్పు చేశారని, జగన్మోహనరెడ్డి దౌర్జన్యం చేస్తే భయపడేవారు ఎవరూ లేరన్నారు.  
 
బహుజన జెఎసి కన్వీనర్ బాల కోటయ్య మాట్లాడుతూ అమరావతి నిర్మాణం జరిగితే బహుజనులకే ప్రయోజనం అన్నారు. రాజధాని ఉద్యమం 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 12 న దళిత జెఎసి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకాలు చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బహుజనులకు పిలుపునివ్వనున్నట్లు తెలిపారు.
 
మాజీ శాసన సభ్యులు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ అమరావతి ఉద్యమం గ్రామ స్థాయికి కూడా తీసుకువెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని ప్రజల్లో కదలిక వచ్చే విధంగా చేయాలన్నారు . జెఎసి తలపెట్టిన కార్యాచరణ కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం కాదని రాజధాని రాష్ట్రానికి కాబట్టి జెఎసి ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉదమ్య కార్యాచరణను తెలియచేసి పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా చేయాలన్నారు.  
 
అమరావతి కార్యాచరణ సమితి జెఎసి కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ అమరావతి ఉద్యమాన్ని అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులు తప్ప వేరే ఇతర వారెవ్వరూ ఉద్యమంలో పాల్గొనడం లేదని మంత్రులు అంటున్నారన్నారు . రాజకీయ పార్టీల నేతలు కూడా జెఎసిగా ఏర్పడి గ్రామ స్థాయి వారికి కూడా ఉద్యమంలో పాల్గొనే విధంగా పిలుపు ఇవ్వాలని అపుడే ఉద్యమం బలపడి ప్రభుత్వం కదలివస్తుందని అన్నారు. జెఎసి తలపెట్టిన 5 కె రన్ అమరావతి నిరసన ర్యాలీగా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు .  
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిరక్షణ సమితి సభ్యులు సాయికృష్ణ మాట్లాడుతూ  గత 294 రోజులుగా ఉద్యమం పెద్ద ఎత్తున నిర్వహించినట్లు తెలిపారు. గత ఐదు నెలల నుండి కోవిడ్ సందర్భంగా జూమ్ యాప్ , వెబినార్లు నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యమాన్ని మరింత పెంచాలనే ఉద్దేశంతో ఇక నుండి ప్రజల్లో బహిరంగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
 
బాబూరావు(విశాఖపట్నం) మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిడించామని, అయితే ఈ పోరాటానికి ప్రభుత్వం కులం ముద్ర వేసి, ఉద్యమాన్ని నిర్వీర్యంచేయాలని చూస్తుందన్నారు. దీనిని ప్రతిగడించి ఉద్యమాన్ని మరింత ఉదృతంగా చేయాలన్నారు. తొలుత అమరావతి పరిరక్షణ ఉద్యమంలో మరణించిన రైతులు , మహిళలు , స్థానికులకు సంతాప సూచికగా ఒక నిముషం మౌనం పాటించారు. 
 
అనంతరం అఖిలపక్ష సమావేశంలో పలువురు కార్యాచరణకు మద్దతు ఇస్తూనే తమ అభిప్రాయాలను తెలియచేశారు. సమావేశంలో అమరావతి పరిరక్షణ సమితి జెఎసి కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు , దళిత బహుజన ఫ్రంట్ నాయకులు భాగ్యారావు , మహిళా జెఎసి నాయకులు శిరీష , దళిత జెఎసి నాయఃకులు పాకర్ల రమేష్ , పేరిపోగు వెంకటేశ్వరరావు , సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ , గద్దె అనూరాధ , ముప్పాళ్ల నాగేశ్వరరావు , సి.హెచ్ . బాబురావు , విశ్లేషకులు రఫి , అమరావతి మహిళా రైతులు , వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.