1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (13:45 IST)

కోనసీమలో కొత్త వైరస్..20 ఆవులు మృతి

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ ను లంపీ స్కిన్‌గా పిలుస్తున్నారు. వెయ్యికి పైగా ఆవులకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అందులో ఇరవై ఆవులు ఇప్పటికే మృతి చెందినట్టు సమాచారం. కాగా, ఉత్తరాది నుంచి కోనసీమకు ఈ వైరస్ వ్యాపించినట్టు వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో కొత్త వైరస్ వ్యాధి జంతువులను కబళిస్తోంది. కరోనా వైరస్‌ను తలపిస్తున్న ఈ వైరస్‌ను వైద్య వర్గాలు హెర్సీస్‌ అని చెబుతున్నాయి. ఈ హెర్సిస్ వైరస్ వల్ల లంపి స్కిన్ వ్యాధి బారిన పడుతున్న మూగ జీవాలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
 
కోనసీమలో కరోనాను తలపిస్తున్న మరో వైరస్ వ్యాధి ప్రబలిందన్న వార్తలతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హెర్సీస్ వైరస్ వల్ల లంపి స్కిన్ అనే వ్యాధితో జంతువులు, పక్షులు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయని చెబుతున్నారు. కోనసీమలో విజృబిస్తున్న ఈ వైరస్ స్థానిక ప్రజలను వణికిస్తోంది.
 
పశువులకు, కోళ్లకు శరీరంపై భయంకర కంతులు, రంధ్రాలు వచ్చి తీవ్ర రక్త స్రావంతో విలవిల్లాడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
 
ఉత్తరాది జిల్లాల నుంచి కోనసీమకు ఈ వైరస్ పాకిందని పలువురు చెబుతున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున భయాందోళన పెల్లుబుకడంతో అప్రమత్తమైన పశు సంవర్ధక శాఖ చర్యలకుపక్రమించింది.

కానీ ఈ వైరస్‌కు ఎలాంటి వైద్యం లేదని పశు వైద్య ఆధికారులు అంటున్నారు. దాంతో ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోతోంది. పశువుల మరణంతో పెద్ద ఎత్తున నష్టపోతున్నామని వాపోతున్నారు స్థానికులు.