ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (09:49 IST)

ఏపీలో ఏ ఒక్క ఎయిడెడ్ విద్యా సంస్థను మూసివేయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పలు ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాల పనితీరును మెరుగపర్చే లక్ష్యంతోనే  సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు, ఎయిడెడ్ ఉద్యోగులకు నష్టం జరిగే విధంగా ఏ ఒక్క ఎయిడెడ్ విద్యా సంస్థను మూసివేయడం జరుగదని, ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల భద్రతకు, వారి పరిస్థితి మెరుగు పర్చేందుకు త్వరలో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని  పేర్కొన్నారు. అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర్ర, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, పాఠశాల విద్యా డైరెక్టర్ చినవీరభద్రుడు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులతో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. 
 
మంత్రి మాట్లాడుతూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుండి విద్యా రంగంలో పలు సంస్కరణలు తీసుకు వచ్చేందుకు మనబడి నాడు-నేడు, జగన్న విద్యా కానుక, జగన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్దలు వంటి  పలు వినూత్న పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నార‌ని అన్నారు. అయితే ఎన్ని వినూత్న పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా కోట్లాది రూపాయలు అందజేస్తున్నప్పటికీ ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరు మెరుగు పడలేదని, విద్యా ప్రమాణాలు రాను రాను దిగజారుతున్నట్లు  ప్రభుత్వం గుర్తించడం జరిగిందన్నారు. ఎయిడెడ్ విద్యా  సంస్థల పని తీరును అద్యయనం చేసేందుకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఆచార్య రత్నకుమారి అద్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమిస్తూ జి.ఓ. 52 ను ప్రభుత్వం జారీచేసినట్లు మంత్రి తెలిపారు. ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరుపై  ఆ కమిటీ  సమగ్రంగా అద్యయనం చేసి ఈ ఏడాది ఏప్రిల్ 22 న ఒక సమగ్ర నివేదికను ఆ కమిటీ ప్రభుత్వానికి అందజేస్తుంద‌ని చెప్పారు.