బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (06:15 IST)

ఏపీలో వాహనదారులకు జరిమానా బాదుడు

ఏపీలోని వాహన దారులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వాహన జరిమానాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బైక్‌ నుంచి 7 సీటర్‌ కార్ల వరకూ ఒకే తరహా జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10వేలు, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారికి రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.

పర్మిట్‌ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5వేల జరిమానా విధించనున్నట్లు తెలిపింది.

వాహన బరువు చెకింగ్‌ కోసం ఆపకపోతే రూ.40 వేలు, ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది.

అనవసరంగా హారన్‌ మోగిస్తే మొదటిసారి రూ.వెయ్యి, రెండోసారి రూ.2 వేలు జరిమానా విధిస్తామని తెలిపింది. వేగంగా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా వేస్తామని స్పష్టం చేసింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వులపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.