1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (09:31 IST)

బడుగు బలహీనవర్గాలకు రక్షణ కరువు: చంద్రబాబు

మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులును అక్రమ నిర్బంధించడాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఖండించారు. రాయదుర్గం పురపాలికలో టీడీపీ అభ్యర్థి నామినేషనును తిరస్కరించడాన్ని ప్రశ్నించినందుకు కాలువ శ్రీనివాసులును పోలీస్ స్టేషన్ కు తరలించడమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు.

ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల సాయంతో వైసీపీ నేతలు దాడులతో  పేట్రేగిపోతున్నారన్నారని మండిపడ్డారు. 'జగన్ అధికారంలోకి వఛ్చిన తర్వాత బడుగు బలహీనవర్గాలకు రక్షణ కరువైంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును హరిస్తున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం దుర్మార్గం. పేద మధ్య తరగతి ప్రజలు స్వేచ్చగా తిరగలేని దౌర్భాగ్యం స్థితి కల్పించా'రని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ మాజీ మంత్రులను, శాసనసభ్యులను అదుపులోకి తీసుకోవడం హేయమన్నారు. ఇళ్లల్లో ఉన్న టీడీపీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం అన్యాయమన్నారు. రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యంగా మార్చడం గర్హనీయమన్నారు. ఎన్నికలలో నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీ దురాగతాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు.  ప్రజా, న్యాయ క్షేత్రంలో జగన్, వైసీపీ మంత్రులకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపిచ్చారు. ముస్లిం మైనారిటీ, మహిళలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నా నిలవరించకపోవడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.