శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (22:27 IST)

అమరావతిలో సినిమా వారికి నిరసన

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి వచ్చిన సినీ ప్రముఖులకు రాజధాని రైతుల సెగ తగిలింది. మంగళవారం హైదరాబాద్‌ నుండి సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.సురేష్‌బాబు తదితరులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడి నుండి ఉండవల్లిలోని మాజీ ఎంపి గోకరాజు గంగరాజు గెస్ట్‌ హౌస్‌కు వచ్చారు. ఇది తెలుసుకున్న రాజధాని రైతులు వారు బస చేసిన గెస్ట్‌ హౌస్‌ దగ్గరకు చేరుకున్నారు. రైతుల పోరాటానికి సంఘీభావం తెలపాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రైతులను పంపించి వేశారు. అమరావతి రైతులు చేపట్టిన ఆందోళనలు మంగళవారానికి 175వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారి పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ గుంటూరు అరండల్‌పేటలోని టిడిపి జిల్లా కార్యాలయంలో పొలిటికల్‌, నాన్‌ పొలిటికల్‌ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతుల న్యాయమైన పోరాటానికి జెఎసి అండగా ఉంటుందని తెలిపారు.