1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. RTC JAC convenor Ashwathama Reddy comments on RTC Strike

సమ్మెపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్

RTC Strike
తమ డిమాండ్ల సాధన విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల సమాఖ్య ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. అలాగే, మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మెపై పొలిటికల్‌ జేఏసీతో ఆదివారం ఆర్టీసీ జేఏసీ భేటీ అయింది. ఆర్టీసీ సమ్మె భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
ఆదివారం సాయంత్రం మరోసారి గవర్నర్‌ తమిళసైని కలువాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. 16వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌ను కోరాలని జేఏసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ఆర్టీసీ జేఏసీ మరోసారి సమావేశమవుతుందని, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాలన్నదే తమ లక్ష్యమని అశ్వత్థామరెడ్డి తెలిపారు. 
 
ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోరాదని, విజయం సాధించేవరకు పోరాడుదామని అన్నారు. కార్మికుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. అలాగే, ఈ నెల 21న అన్ని ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబసభ్యులతో కలిసి బైఠాయించనున్నారు. 22న మా పొట్టకొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను కార్మికులు విజ్ఞప్తి చేయనున్నారు. 
 
23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలపాలని, సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరనున్నారు. 24న మహిళా కండక్టర్ల దీక్ష, 25న హైవేలు, రహదారులపై రాస్తారోకోలు చేపట్టనున్నారు. 26న ప్రభుత్వం మనసు మారాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష చేప్టనున్నారు. 
 
27న పండగ సందర్భంగా జీతాలు లేకపోవడంవల్ల నిరసన, 28న సమ్మెపై హైకోర్టు విచారణ సందర్భంగా విరామం. ఇక, ఈ నెల 30న 5 లక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన వేదికను త్వరలో ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నవంబరు 5 నుండి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం