1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 2 అక్టోబరు 2021 (19:35 IST)

తిరుమల శ్రీవారి డాలర్లు కావాలా? అవి లేవండీ...

తిరుమల శ్రీవారి డాలర్‌కు ఎంతో డిమాండ్ ఉంది. స్వామివారి డాలర్‌ను చాలామంది మెడలో ధరిస్తూ ఉంటారు. స్వామివారి ప్రతిమతో ఉన్న డాలర్‌ను ధరిస్తే ఎంతో మంచిదన్నది భక్తుల నమ్మకం. అందుకే శ్రీవారి డాలర్‌ను తిరుమలలో టిటిడినే విక్రయిస్తోంది. అయితే ప్రస్తుతం శ్రీవారి డాలర్లు భక్తులకు అందుబాటులో లేకుండా పోయాయి.
 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్సించుకున్న భక్తులు యాత్రకు గుర్తుగా శ్రీవారి చిత్రాలతో రూపొందించిన బంగారు, వెండి, రాగి డాలర్లను కొనుగోలు చేస్తుంటారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా టిటిడి వీటి విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
 
కొంతకాలంగా ఈ కేంద్రంలో తక్కువ బరువుతో వున్న బంగారు, వెండి డాలర్లు అందుబాటులో లేవు. కేవలం పదిగ్రాముల బంగారు, రాగి డాలర్లు మాత్రమే అమ్ముతున్నారు. 5, 2 గ్రాముల బంగారు డాలర్లు 50, 10, 5 గ్రాముల వెండి డాలర్లు నిండుకున్నాయి. 
 
కొనుగోలు కేంద్రానికి వచ్చిన భక్తులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ నెలలో బ్రహ్మత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టిటిడి డాలర్లు అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.