1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (22:57 IST)

రేపు తిరుమ‌లలో రెండో విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై సెప్టెంబరు 28వ తేదీ మంగ‌ళ‌వారం రెండో విడ‌త‌ అఖండ బాలకాండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
 
బాలకాండలోని 3 నుండి 7 సర్గల వ‌ర‌కు గ‌ల 142 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం,  టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్,  జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
 
ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.
 
కాగా, క‌రోనా వైర‌స్ న‌శించాల‌ని కోరుతూ 2020, జూన్ 11న సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభ‌మైంది. 2021 జులై 24 వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. ఆ త‌రువాత క‌రోనా వైర‌స్ మూడో ద‌శ‌లో పిల్ల‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌కుండా స్వామివారిని ప్రార్థిస్తూ 2021 జులై 25వ తేదీ నుండి బాల‌కాండ పారాయ‌ణాన్ని టిటిడి ప్రారంభించింది.