1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (15:51 IST)

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ తిరస్కరణ?

babu cid court
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అవినీతి జరిగిందనే కేసుకు సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా ఏసీబీ పేర్కొంది. ఇరుపక్షాల వాదనలను ఆలకించిన జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. సాయంత్రం 4 గంటలకు కాసేపట్లో తీర్పును వెలువరించారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును రిమాండ్ కు ఇవ్వాలనే పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
 
మరోవైపు బాబుకు రిమాండ్ విధించడం ఖాయమని అధికార వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరో అర గంటలో జడ్జ్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా... సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపించింది. మరోవైపు, ఆదివారం ఉదయం నుంచి సుధీర్ఘంగా ఏకంగా ఆరున్నర గంటల పాటు విచారణ సాగింది. 
 
కాగా, వాదనల అనంతరం కోర్టు బయటికి వచ్చిన చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయసంకేతం ఇచ్చారు. బొటనవేలు పైకెత్తి అంతా ఓకే అనే సంజ్ఞ చేశారు. ఈ ఉదయం 8 గంటల నుంచి ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఓవైపు చంద్రబాబు తరపున సుప్రీంకోర్టులో ఎంతో అనుభవం ఉన్న సిద్ధార్థ లూథ్రా... మరోవైపు సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు అనుమతితో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్వయంగా వాదనలు వినిపించారు. తన అరెస్టు అక్రమం అని ఆక్రోశించారు.
 
కాగా, చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. 'నిన్న సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడలో చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నాం. నా న్యాయవాద వృత్తిలో ఏనాడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదు' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.