1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (08:12 IST)

విశాఖ వేదికగా విజన్-2047ను ఆవిష్కరించిన టీడీపీ చీఫ్ చంద్రబాబు

cbn with national flag
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ వేదికగా విజన్-2047ను ఆవిష్కరించారు. పంద్రాగస్టు వేడుకల రోజున ఆయన దీన్ని విడుదల జేశారు. ఆ తర్వాత పవర్ పాయింట్ ద్వారా డాక్యుమెంట్ అంశాలపై వివరణ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఐదు అంసాలను పేర్కొన్నారు. వీటిని ముఖ్యాంశాలను పరిశీలిస్తే,
 
1. సోలార్ ఎనర్జీ, విండ్, పంప్డ్ ఎనర్జీ, హైబ్రిడ్ మోడల్ డెమోక్రటైజేషన్, డీకార్బనైజేషన్ అండ్ డిజిటలైజేషన్ 
భగవంతుడు భారతదేశానికి మంచి ఎండను ఇచ్చాడు. ఆ ఎండ సాయంతో కరెంటు తయారుచేసుకోవచ్చు. ఒకప్పుడు సోలార్ విద్యుత్ ఒక యూనిట్ రూ.14 ఉంటే, ఇప్పుడు బాగా తగ్గిపోయింది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ ఒక యూనిట్ రూ.1.50 నుంచి రూ.2.00కి వస్తుందంటే అందరూ ఎగతాళి చేశారు. ప్రస్తుతం రూ.1.99కి వచ్చింది. విస్తృత స్థాయిలో ఉత్పాదన చేసినప్పుడు సాధారణంగానే రేట్లు తగ్గుతాయి. ఆ మేరకు టీడీపీ ప్రభుత్వం చొరవ చూపింది.
 
సోలార్ విద్యుత్ ఎండ ఉంటేనే వస్తుంది. ఎండ లేని సాయంత్రం వేళల్లో పవన్ శక్తి (విండ్ ఎనర్జీ) ద్వారా విద్యుత్ తయారు చేసుకోవాలి. ఇవేవీ లేనప్పుడు పంప్డ్ ఎనర్జీ (హైడల్) తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపినదే హైబ్రిడ్ మోడల్. దీని ద్వారా అన్ని రంగాలకు విద్యుత్ అందించవచ్చు. వీటివల్ల కాలుష్యం కూడా ఉండదు. డిజిటలైజేషన్ వల్ల విద్యుత్ గ్రిడ్ మేనేజ్ చేసుకోవచ్చు. ఎనర్జీ అనేది ఒక గేమ్ చేంజర్.
 
2. వాటర్ సెక్యూర్ ఇండియా
నీటి ప్రాధాన్యత చాలా ఉంది. హైడల్ ఎనర్జీలో నీళ్లే కీలకం. వ్యవసాయానికి కూడా నీళ్లు కావాలి. అందుకే భారత్ నీటి పరంగా పూర్తి భరోసాతో ఉండాలనే వాటర్ సెక్యూర్ ఇండియా సిద్ధాంతం తీసుకువచ్చాం.
 
3. అండ్ ఇన్నోవేషన్ లీడర్స్ ఆఫ్ ఫ్యూచర్
ఇప్పుడు టెక్నాలజీ ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలుసు. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నవ్వారు. సెల్ ఫోన్ ఏమైనా తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు. కానీ ఆ రోజు ఒకటే చెప్పాను... సెల్ ఫోన్‌ను అందరూ గుర్తించే రోజు వస్తుంది అని స్పష్టం చేశాను. ఇవాళ సెల్ ఫోన్ తిండిపెట్టడమే కాదు, లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తోంది. అదీ... టెక్నాలజీకి ఉండే శక్తి టెక్నాలజీతో భవిష్యత్తులో చాలా మార్పులు రాబోతున్నాయి.
 
4. డెమొగ్రాఫిక్ మేనేజ్ మెంట్ అండ్ పీ4 మోడల్ ఆఫ్ వెల్ఫేర్
ఇప్పటివరకు దేశంలో జనాభా తగ్గించే ఉద్దేశంతో నియంత్రణకు వెళ్లాం. జనాభా పెరుగుదలను కట్టడి చేశాం. ఇప్పుడు నేను ఏమంటానంటే... అధిక జనాభానే మన అనుకూలత అంటాను. ఈ అనుకూలత 2047 వరకు ఉంటుంది. ఆ తర్వాత దేశంలో ముసలివాళ్ల సంఖ్య పెరిగి, యువత సంఖ్య తగ్గిపోతుంది, పనిచేసేవాళ్ల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. మేం రూపొందించిన జనాభా నిర్వహణ సిద్ధాంతం ఆ సమస్యకు పరిష్కారం చూపుతుంది.ఇందులోనే పీ4 మోడల్ కూడా పొందుపరిచాం. ప్రతి ఒక్కరూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోవడం కాదు... ఈ స్వతంత్ర భారతదేశంలో పేదరికం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది.
 
5. ఇండియన్ సిటిజెన్ టు సర్వ్ గ్లోబల్ ఎకానమీ
భారతదేశంలోని ప్రతి వ్యక్తి తన సేవలను, తన ఉత్పాదనలను ప్రపంచానికి అందించే దిశగా ఆలోచిస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి.