ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:17 IST)

కుప్పంలో టిడిపి నష్టనివారణ చర్యలు

ఎపిలో గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు విడతల్లోనూ టిడిపి ఘోర పరాభవాన్ని చవిచూసింది. 14 ఏళ్లు సిఎంగా పని చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గం, టిడిపికి కంచుకోట అయిన కుప్పంలోనూ ఎదురుదెబ్బ తగిలింది.

కుప్పంలో 93 పంచాయతీలు ఉండగా.. 89 పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరిగాయి. అందులో 75 పంచాయతీల్లో వైసిపి బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. కేవలం 14 పంచాయతీల్లో టిడిపి మద్దతుదారులు విజయం సాధించారు.

అయితే, చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లె పంచాయతీలో మాత్రం టిడిపి బలపర్చిన అభ్యర్థి బి.లక్ష్మి ప్రత్యర్థిపై 563 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం చంద్రబాబుకు కాస్త ఊరటనిచ్చే విషయం తప్ప నియోజకవర్గ పరిధిలో మాత్రం అవమానకరమైన స్థానాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పంలో టిడిపి ఉనికిని కాపాడుకోవడానికి నియోజకవర్గంలో నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా పలువురు టిడిపి నాయకులకు ఫోన్లు చేసి, వారికి ధైర్యం చెబుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

కీలక నాయకులతోపాటు కింది స్థాయి వారికి కూడా ఫోన్లు చేస్తూ.. 'అధైర్య పడొద్దు.. నేను చూసుకుంటా' అంటూ వారికి ధైర్య వచనాలు వల్లిస్తున్నట్లు సమాచారం. అక్కడి నేతలతో సైతం చంద్రబాబు మాట్లాడారు. ఇకపై తన మార్గంలో తాను కుప్పం నుంచి సమాచారం తెప్పించుకుని, పార్టీ వ్యవహారాలను స్వయంగా చూసుకుంటానని చెప్పినట్లు సమాచారం.

తాను నమ్మిన కొందరు నాయకులు ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకపోవడం.. పార్టీ అధికారంలో ఉండగా అడ్డంగా సంపాదించుకున్న వారు ఇప్పుడు ఇతర పార్టీలకు వెళ్లడం.. ఉన్న వారు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడం.. కొందరు ఇచ్చిన సమాచారాన్ని నమ్మి అంతా బాగుందని అనుకుంటే ఫలితాలు తారుమారవ్వడం వంటి వాటితో చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు మళ్లీ గ్రామాల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు.