గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 12 ఆగస్టు 2020 (14:13 IST)

ఆన్‌లైన్ స్టడీస్.. జూమ్ యాప్‌తో కుస్తీలు పడుతున్న ఉపాధ్యాయులు

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పుడో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు, కళాశాలలు ఇప్పటివరకు తెరవకుకుండానే అలాగే మూసివేసి ఉన్నాయి. దీంతో విద్యార్థులంతా ఇండ్లకే పరిమితమై ఉండటంతో ఇప్పటికి ఈ ఏడాది విద్యాసంవత్సరంలో కొన్ని నెలలు వృధా అయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది విద్యార్థులు నష్టపోక తప్పదు.
 
ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చింది. విద్యార్థులకు విద్యాబోధన కొనసాగించేందుకు డిజిటల్ బోధన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ టీచర్లకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. టెక్నాలజీ సాయంతో వివిధ పాఠ్యాంశాలను విద్యార్థులకు ఎలా బోధించాలన్న అంశంపై జూమ్ యాప్ ద్వారా ఐదు రోజులుగా రోజుకు రెండు గంటలపాటు శిక్షణ ఇస్తున్నది.
 
ఆయా సబ్జెక్టులో నిష్ణాతులను ఎంపిక చేసి వారి ద్వారా మిగతా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తున్నది. ఇక విద్యాశాఖ అందిస్తున్న ఈ ఆన్ లైన్ శిక్షణకు ఎంతమంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారనే విషయంపై క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌లు నిఘా పెడుతున్నారు.
 
ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం కలిపి 26,725 ఉన్నాయి. కాగా ఈ పాఠశాలలో 22 లక్షల మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇంతమందికి విద్య అందించడం కోసం గాను 1,34,191 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 475 కేజీవీబీల్లో 1,00,211 మంది విద్యార్థులు ఉన్నారు. 258 ఎయిడెడ్ పాఠశాలలకు గాను 53,524 మంది చదువుతున్నారు. 194 ఆదర్శ పాఠశాలలు ఉండగా ఇందులో 1,26,612 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
 
రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 4,658 ఉండగా ఇందులో 8,89,001 విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం రాష్ట్ర పరిధిలో నడిచే ఉన్నత పాఠశాలలు 5,585 ఉండగా వీటిలో 11,69,348 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సబ్జెక్టులవారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో మొదట గణిత ఉపాధ్యాయులకు వేదిక్ గణితంపై రిసోర్సు పర్సన్ల ద్వారా ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు.
 
టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎలా ముందుకు సాగాలనే అంశంపై లెర్నింగ్ అవుట్‌కమ్ పైన టీచర్లకు శిక్షణ ఇస్తున్నది టీశాట్, దూరదర్శన్ వంటి చానళ్లు, ఎస్సీఈఆర్టీ యూట్యూబ్ వంటి మాద్యమాల ద్వారా బోధించాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తున్నది. దీనికోసం ఉపాధ్యాయులు ఆయా గ్రామాల్లోని సాంకేతిక అంశాలను వాడుకోవాల్సి ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు 40 నిమిషాలపాటు బోధించిన తర్వాత అ విషయాలు విద్యార్థులకు ఏ మాత్రం అర్థమయ్యిందో తెలుసుకునే విధానంపై రిసోర్సు పర్సన్లు ఉపాధ్యాయులకు చెప్తున్నారు.