1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (14:13 IST)

వరినాటుకు దినకూలీ రూ.1000 ... ఎక్కడ?

సాధారణంగా వరినాటుకు వెళ్లే వారికి కూలీ కింద రూ.300 నుంచి రూ.400 వరకు ఇస్తుంటారు. కానీ, ఈ కాలం పోయింది. ఇపుడు ఏకంగా రూ.800 నుంచి రూ.1000 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి మండలం, మెట్‌పల్లి నెలకొంది. 
 
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. దీంతో కూలీల రెట్లు రెండింతలు పెరిగిపోయాయి. ఫలితంగా రైతులు తలపట్టుకుంటున్నా తుకం (నారుమళ్లు) ముదిరిపోయి అదును దాటిపోతుండటంతో అడిగినంత చెల్లించక తప్పడం లేదు. కూలీ రేట్లు రెండింతలు కావడానికి కరోనా పరిస్థితులే కారణం. 
 
వైరస్‌ సోకుతుందనే భయంతో ఇళ్ల నుంచి కూలీలు బయటకు రావడం లేదు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూలీలు వచ్చే అవకాశం లేదు. దీంతో  వచ్చే ఆ కొద్దిమంది కూలీ రేట్లను పెంచేశారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సాధారణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో వానాకాలం సాధారణ సాగు 1.03 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటికే 1.19 కోట్ల ఎకరాల్లో  పంటలు సాగయ్యాయి. 
 
ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలామంది రైతులు తమ పొలంలో నాట్లు వేసుకున్న తర్వాత బదులు వచ్చిన మిగతా రైతుల పొలాల్లోకి నాట్లు వేసేందుకు వెళతారు. ఇప్పుడు ఎంతయినా చెల్లించి వారి పొలంలో నాటు వేసుకుంటున్నారే తప్ప బదులు వెళ్లడం లేదు. దీంతో కూలీల అవసరం వస్తోంది.
 
అందుకే, వనపర్తి మండలం మెట్‌పల్లిలో గత యేడాది వరినాట్లు వేసేందుకు మహిళా కూలీలకు రూ.400 నుంచి రూ.500 దాకా చెల్లించగా, ఈ ఏడాది కూలీరేట్లు రెట్టింపయ్యాయి. రూ.800 తీసుకుంటున్నారు. అదే పొరుగూరుకు వెళ్లి నాట్లు వేయాలంటే రూ.1000 దాకా అడుగుతున్నారు. దీనికి రవాణా ఖర్చులు, మినరల్‌ వాటర్‌ ఇవ్వడం అదనం! గ్రామంలోని కొంతమంది కూలీలు ఒక జట్టుగా ఏర్పడి వరినాట్లు వేసేందుకు పొలాలను గుత్తకు తీసుకుంటున్నారు.