1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (11:32 IST)

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. వేరొకరితో భార్య రాసలీలలు.. అంతే..?

ప్రేమకు, పెళ్లికి విలువలు తగ్గిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధానికి మచ్చ తెచ్చే సంఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తట్టుకోలేకపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతేగాకుండా తన ఆత్మహత్యకు కారణం భార్యేనని సూసైడ్ నోట్‌లో స్పష్టంగా రాశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్టలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంజాగుట్టలోని ప్రతాప్ నగర్‌లో ఉంటున్న ప్రశాంత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పావని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రశాంతంగా సాగుతున్న వీరి కాపురంలోకి ప్రణయ్ అనే యువకుడు ప్రవేశించాడు. 
 
అతనితో పావని వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే దీన్ని మానుకోవాలని ప్రశాంత్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. కానీ పావని ఏమాత్రం మారకపోవడానికి తోడు.. మాటకు ప్రతీసారి ప్రశాంత్‌ను చనిపోమని దూషించేది. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన ప్రశాంత్ తన ఫ్లాటులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కాగా, ప్రశాంత్ ఆత్మహత్యకు కారణమైన పావనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో పలుమార్లు పెద్దల సమక్షంలో నచ్చజెప్పినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వెల్లడించారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు. అయితే పావని మాత్రం.. తనకు వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉన్నట్లు ప్రశాంత్ అనుమానించేవాడని తెలిపింది. రోజూ తనను వేధించేవాడని చెప్తోంది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.