మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జనవరి 2021 (13:05 IST)

నాణెంపై తెలుగు భాష. ... తెలుగు భాషకు పట్టం కట్టిన బ్రిటీష్ పాలకులు

ఓ సారి హస్తినలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగుతోంది. గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులంతా ఆ సమావేశానికి హాజరైవున్నారు. 
 
ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య "ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య"ను సభ దృష్టికి తీసుకువచ్చారు. అపుడు వల్లభాయి పటేల్ కల్పించుకుని... పట్టాభీ! నువ్వు ‘ఆంధ్ర రాష్ట్రం... ఆంధ్ర రాష్ట్రం...'' అని ఎప్పుడూ అంటూ ఉంటావు. అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా?. మీరంతా ‘మద్రాసీ’లు కదా? అంటూ ఎగతాళిగా మాట్లాడారు.
 
అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య తన జేబులో నుంచి అణా కాసును తీసి "సర్ధార్ జీ! దీనిపై ‘ఒక అణా' అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ, జాతీయ భాష అయిన హిందీలోనూ, దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ, ఆ తర్వాత ‘ఒక అణా' అని తెలుగులోనూ రాసి ఉంది. ఇది బ్రిటిష్ వారు తయారు చేసిన అణా నాణెం. (అప్పటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు). మరి ఈ నాణెంపై మా ‘తెలుగు భాష ఉంది… కానీ, మీ గుజరాతీ భాష ఎక్కడా లేదే? అంటూ చురక వేశారు. పట్టాభి సమాధానానికి పటేల్ ఆశ్చర్యపోయారు. ఆ మాటలు విన్న గాంధీజీ కూడా చిరునవ్వుతో ఉండిపోయారు. గాంధీ గారి మాతృభాష కూడా గుజరాతీ భాషే కదా. 
 
భారతదేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే… తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, ప్రపంచంలో అధికంగా మాట్లాడే బెంగాలీ భాష, తెలుగు భాషలను ప్రవేశ పెట్టి, మన తెలుగు చరిత్ర గొప్పదనం.