1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. The SEC's decision is a democratic victory: Pattipati Pullarao

ఎస్‌ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్య విజయం: ప్రత్తిపాటి పుల్లారావు

SEC decision
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విజయమని మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చికలూరిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఐదు కోట్ల ప్రజలు ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు,  బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూడలేదన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపే పరిస్థితి రాష్ట్రంలో లేదని ప్రజానీకానికి అర్థమయ్యిందన్నారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. గతంలో ప్రతిపక్షనేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కడప ఎస్పీ, శ్రీకాకుళం కలెక్టర్‌, మంగళగిరి సీఐలను కూడా మార్చిందని గుర్తు చేశారు.

మరి అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రత్తిపాటి అధికార పార్టీని ప్రశ్నించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయమా? అని నిలదీశారు. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే అరాచకాలకు పాల్పడితే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉంటామని పుల్లారావు స్పష్టం చేశారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
విద్యా వ్యవస్థపై 'కరోనా' ప్రభావం