గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగం సక్సెస్

sslvd3 satilite
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కీలోల ఈవోఎస్ 08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మొత్తం 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది. 
 
విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది. ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఈవోఎస్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వే, లాంగ్ వే ఇన్‌ఫ్రా రెడ్‌లో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది. 
 
అగ్ని మిస్సైల్ మ్యాన్ ఇకలేరు.. అనారోగ్యంతో కన్నమూత 
 
అగ్ని మిస్సైల్ రూపకర్త ఆర్ఎన్ అగర్వాల్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రామ్ నారాయణ్ అగర్వాల్ (ఆర్ఎన్ అగర్వాల్) 84 యేళ్ల వయసులో గురువారం హైదరాబాద్ నగరంలో మృతి చెందారు. చైనాకు ముచ్చెమటలు పట్టిస్తున్న అగ్ని క్షిపణులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అభివృద్ధి చేయడంతో ఆయన ఎంతో పేరుగడించారు. అగ్ని క్షిపణి ప్రాజెక్టుకు తొలి డైరెక్టరుగా వ్యవహరించారు. దేశానికి ఆయన చేసిన సేవలకుగాను గత 1990లో పద్మశ్రీ, 2000లో పద్మ భూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. 2004లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అగర్వాల్ సొంతం చేసుకున్నారు. 
 
లాంగ్ రేజ్ క్షిపణులు అభివృద్ధిలో అగర్వాల్ పేరుగడించారు. ప్రఖ్యాత ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. డీఆర్డీవోతో అగర్వాల్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. 1983లో ప్రారంభమైన అగ్నిక్షిపణి కార్యక్రమానికి అగర్వాల్ నాయకత్వం వహించారు. అగర్వాల్ మృతిపట్ల డీఆర్డీవో శాస్త్రవేత్తలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఒక మేధావిని కోల్పోయినట్టు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కాగా, అగర్వాల్ ఐఐటీ మద్రాస్, బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో విద్యాభ్యాసం చేశారు.