1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (13:04 IST)

విశాఖలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం : మురళీ మోహన్ - గంటా భవనాల కూల్చివేత

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. పైగా, అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ తొలుత కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజా వేదికతోనే శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై దృష్టిసారించారు. 
 
ఈ నేపథ్యంలో విశాఖపట్టణంలో ఉన్న అక్రమ నిర్మాణాలపై ఉడా (విశాఖపట్టణం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులోభాగంగా, బుధవారం జోన్‌-2 పరిధిలోని ఎంవీపీ సెక్టార్‌-11లో ప్లాన్‌ లేకుండా నిర్మించిన జయభేరి ట్రూ వ్యాల్యూ కార్‌ షోరూమ్‌ (తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ మురళీమోహన్‌కు చెందింది)ను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చేశారు. 
 
ఎంవీపీ సెక్టార్‌-11లో గల వెయ్యి గజాల స్థలంలో ప్లాన్‌ లేకుండా కొంతకాలం కిందట షెడ్‌ ఏర్పాటుచేసి అందులో షోరూమ్‌ నడుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత కార్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీనికి ప్లాన్‌ లేదని గుర్తించిన జోన్‌-2 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సీసీపీ విద్యుల్లత దృష్టికి తీసుకువెళ్లగా ఆమె కమిషనర్‌ జి.సృజనకు తెలియజేశారు. తక్షణం దానిని కూల్చేయాలని కమిషనర్‌ ఆదేశించడంతో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది యంత్రాల సహాయంతో తొలగించారు. 
 
అలాగే జోన్‌-1 పరిధిలో గల భీమిలిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన క్యాంప్‌ కార్యాలయానికి ఎలాంటి ప్లాన్‌ లేనట్టు గుర్తించారు. దీంతోపాటు జోన్‌-2 పరిధి ద్వారకానగర్‌లో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు చెందిన భవనం ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించినట్టు గుర్తించారు. వీటిని కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.