1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vizag Student dies in Australia

ఆస్ట్రేలియాలో చలికి ఊపిరాడక మృతి చెందిన వైజాగ్ విద్యార్థి!

Vizag Student
ఆస్ట్రేలియాలో వైజాగ్‌కు చెందిన విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం వేళ వాకింగ్‌కు వెళ్లగా చలికి ఊపిరాడకపోవడంతో చనిపోయాడు.  ఈ విషయం తెలుసిన ఆ మృతుని కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ పారిశ్రామిక ప్రాంతం గుల్లలపాలెం వుడా కాలనీకి చెందిన ప్రసంగి శ్రీనివాసరావు, కవిత దంపతుల పెద్ద కుమారుడు చెన్నకేశవ సాయి (20) మెల్‌బోర్న్‌లో డిగ్రీ చదివేందుకు వెళ్లారు. 
 
ప్రసుత్తం బీఎస్సీ రెండో ఏడాది చదువుతున్న చెన్నకేశవ సాయి ఈ నెల 16న అక్కడి పార్కులో ఉదయపు నడకకు వెళ్లారు. తీవ్రమైన చలివల్ల ఊపిరి అందక అస్వస్థతకుగురై కుప్పకూలిపోయారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో అటువైపు ఎవరూ రాకపోయేసరికి మరణించారు. 
 
అయితే, అటువైపు మూడు రోజుల వరకు ఏ ఒక్కరూ రాకపోవడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు. బంధువులు, స్నేహితులు గాలింపు చేపట్టడంతో విషయం బయటపడింది. వెంటనే వారు చెన్నకేశవ సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం విశాఖలోని స్వగృహానికి తీసుకొచ్చిన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
About Writer
ఠాగూర్