1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

'వలంటీర్లకు వందనం' - నేడు లాంఛనంగా ప్రారంభం

jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ హయాంలో నియమించిన వలంటీర్ల సేవలను గుర్తించేందుకు వీలుగా వలంటీర్లకు వందనం అనే కార్యక్రానికి శ్రీకారం చుట్టారు. దీన్ని ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేశారు. 
 
విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటరులో ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 లక్షల 33 వేల 719 మందికి 243.34 కోట్ల రూపాయల నగదు పురస్కారాలు అందజేస్తారు. మే 19వ తారీఖు నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం మొదలు కానుంది. 
 
కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలు అందించనున్నారు. సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు 30 వేల రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వాలంటీర్లు.. అంటే 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. 
 
సేవా రత్న కింద సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ పాటు 20 వేల రూపాయల నగదు బహుమతి అందించనున్నారు. ప్రతి మండలం, మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 మంది చొప్పున టాప్ 1 ర్యాంకు సాధించిన వాలంటీర్లకు, మొత్తంగా 4 వేల 220 మందికి సేవా రత్న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
 
సేవా మిత్ర అవార్డు కింద సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ.10 వేల నగదును బహుమతిగా అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా యేడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పని చేసిన వలంటీర్లకు 2,28,624 మందికి ఈ సేవా మిత్ర అవార్డులను అందజేస్తారు.