1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (11:53 IST)

నాటైపెలాగుంటాదో తెలుసా... ఎవరైనా చచ్చిపోతానంటే మంచి దమ్మా అంటాను... వైకాపా ఎమ్మెల్యే

kannababu raju
ఏపీలోని వైకాపా ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతుంది. సీఎం జగన్ ఆదేశం మేరకు ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇలాంటి వారిలో అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు మహిళలు సమస్యలతో స్వాగతం పలికారు. 
 
అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఇంటింటికీ వెళ్లి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక మత్స్యకార మహిళ తనకు కరెంటు బిల్లు అధికంగా వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన ఏసీ వాడుతున్నావా? అని ప్రశ్నించారు. 'మాకు ఏసీలేటి బాబూ..' అని ఆమె అనగా, పొద్దల్లా ఫ్యాను వేసుకొని తొంగొని ఉంటావు.. అందుకే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది.. అంటూ ఆమెపై పరుష పద జాలం ఉపయోగించారు. 
 
ఆ తర్వాత కన్నబాబుకు మరో మహిళ గ్రామ సమస్యలు చెప్పడానికి ప్రయత్నించారు. వెంటనే ఎమ్మెల్యే కలుగజేసు కొని 'నువ్వు జాతీయ నాయకురాలివి అనుకుంటున్నావా.... నీ సమస్యలు చెప్పు...' అంటూ మరో ఇంటికి వెళ్లిపోయారు. 
 
అక్కడున్న మహిళ 'మాకు ప్రభుత్వం నుంచి ఏ పథకం కూడా రావడం లేదండీ. మేము బతికున్నాట్లా, లేనట్టా? మీరు కన్నబాబురాజే కదా? మీ దృష్టిలో మేం చచ్చిపోయినట్టేనా..' అని ఆడిగారు. దీనిపై ఆయన 'నాటై పెలాగుంటాదో తెలుసా... ఎవరైనా చచ్చిపోతానంటే మంచి దమ్మా అంటాను... వద్దని అనను" అంటూ ముందుకు వెళ్లిపోయారు.
 
అదేవిధంగా ఓ మహిత్స్యకార మహిళ వచ్చిన పథకాలను రికార్డుల్లో చూశారు. ఈ పథకాలన్నీ ఎవరిస్తున్నారు?.. అని ఆమెను ప్రశ్నించారు. ఆమె పక్కనే ఉన్న ఉమ్మిడి అప్పారావు అనే వైసీపీ నేత వైపు చూశారు. దీనికి కోపగించుకున్న కన్నబాబురాజు... నేనడిగితే ఆయన ముఖం ఎందుకు చూస్తున్నావు.. చెప్పు... ఈ పథకాలు ఎవరిచ్చారు.' అని మరోమారు రెట్టించి అడిగారు. దానికి ఆమె దీనంగా ముఖం పెడుతూ 'తెలియదు' అని సమాధానమిచ్చారు. దీంతో కన్నబాబురాజుకు చిర్రె త్తుకొచ్చింది. 'పథకాలు తీసుకుంటున్నావు. కానీ ఎవరిచ్చారో తెలియదా? మీకిచ్చిన పథకాల లిస్ట్ పై పెద్ద బొమ్మ కనబడుతోంది. కదా...' అని జగన్ బొమ్మను చూపించి పక్కింటికి వెళ్లారు.