1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (08:37 IST)

సీఎం సంతకాలు.. పిల్లోడి పిచ్చి రాతలతో సమానం : వైకాపా రెబెల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

sridharreddy
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోమారు విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి సంతకాలు పిల్లోడి పిచ్చి రాతలతో సమానమని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి జగన్ యవ్వారం పేరు గొప్ప.. ఊరు దిబ్బలా ఉందని అన్నారు. 
 
మంగళవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని గాంధీనగర్ వద్ద 150 అంకణాల స్థలాన్ని క్రైస్తవుల కమ్యూనిటీ హాలు నిర్మాణానికి కేటాయించినట్టు తెలిపారు. అందులో నిర్మాణాలకు నిధుల కోసం మూడుసార్లు తానే సీఎంకు వినతిపత్రాలు అందజేశానని, వాటిపై
ఆయన సంతకాలు చేసి వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పారే తప్ప పైసా కూడా విదల్చలేదన్నారు.
sridharreddy
 
ముఖ్యమంత్రి కాగితంపై సంతకం చేస్తే అది శాసనం కావాలే తప్ప ఇలా పేరు గొప్ప ఊరుదిబ్బన్నట్టు ఉండకూడదన్నారు. ఈ ఏడాది జనవరి 2న చివరిసారిగా సీఎంను కలిసినప్పుడు కూడా కమ్యూనిటీ హాలు నిధుల విషయం ప్రస్తావించానన్నారు. సీఎం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 8న పోస్టుకార్డు, వాట్సప్, టెక్స్ట్ ద్వారా నిరసన సందేశాలను ప్రభుత్వానికి పంపుతానని చెప్పారు. 
 
18వ తేదీ వరకు నెల్లూరులోని అన్ని చర్చిలను సందర్శించి, ఒక్కో చర్చి నుంచి ఒక్కో ఇటుక తీసుకెళ్లి గాంధీనగర్ కమ్యూనిటీ హాలు స్థలం వద్ద నిరసన తెలుపుతానని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా క్రిస్టియన్ కమ్యూనిటీ హాలుకు నిధుల మంజూరుకు బాధ్యత తీసుకుంటే తాను చేపట్టిన నిరసనను విరమించుకుంటానని శ్రీధర్రెడ్డి తెలిపారు.