1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (13:13 IST)

రెచ్చిపోయిన వైకాపా ఎమ్మెల్యే కంగాటి అనుచరులు - టోల్ ప్లాజా ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా పార్టీ నేతలు, వారి అనుచరగణం అధికారమదంతో రెచ్చిపోతున్నారు. తమకు అడ్డుతగిలేవారిని, వ్యతిరేకించేవారిని, తమ మాటకు అడ్డు చెప్పేవారిపై దాడి చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా అమకతాడు టోల్‌ప్లాజపై వైకాపా కార్యకర్తలు తమ ప్రతాపం చూపించారు. 
 
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు ఈ టోల్‌ప్లాజాను ధ్వంసం చేశారు. ఆ తర్వాత వీరంగం సృష్టించారు. తమ వాహనానికే అనుమతి ఇవ్వరా అంటూ టోల్‌ప్లాజాను ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. దీంతో ప్రాణభయంతో టోల్‌ప్లాజా సిబ్బంది పరుగులు తీశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ఎమ్మెల్యే శ్రీదేవి జిల్లాలోని తుగ్గలి మండలం పర్యటనను ముగించుకుని డోవ్ జాతీయ రహదారి మీదుగా కర్నూలుకు బయలుదేరారు. అమకతాడు టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది ఎమ్మెల్యే వాహనానికి అనుమతి ఇచ్చారు. కానీ, ఎమ్మెల్యే అనుచరులు వచ్చిన వాహనాలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా ఒక్కసారిగా రెచ్చిపోయారు. 
 
తమ వాహనాన్నే అడ్డుకుంటారా? అంటూ దుర్భాషలాడుతూ కర్రలతో టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడి ఫుటేజీలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే... ఈ దాడి ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని కృష్ణగిరి ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.