1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (14:26 IST)

తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టిసారించారు. ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం ఆ రాష్ట్రంపై ఆయన ఫోకస్ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే యేడాది (2023)లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమయాత్తం చేయాలని ఆయన భావిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, ఆయన సోమవారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ నేతలు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. ఈ సమావేశాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని గ్రూపులకు చెందిన నేతలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఇందులో పార్టీ బలోపేతం, ప్రజా ఉద్యమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా పార్టీ గ్రూపు రాజకీయాలపై చర్చించనున్నారు. 
 
ప్రధానంగా ఈ భేటీకి టీపీసీసీ చీఫ్‌ను వ్యతితేరికిస్తున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మరో సీనియర్ నేత వి.హనుమంతరావులను ఆహ్వానించడంతో ఈ భేటీ వాడివేడిగా జరిగే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత రాహుల్ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఈ దఫా తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, కామారెడ్డి నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.