శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (14:56 IST)

పబ్‌లో తెలంగాణ - ఆంధ్రా ఎంపీల వారసులు! అందుకే...

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటల్‌ పబ్‌లో జూబ్లీ హిల్స్ పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, సినీ సెలెబ్రిటీల కుమారులు, కుమార్తెలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణకు చెందిన మాజీ డీజీపీ కుమార్తె‌తో పాటు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఉన్నట్టు వినికిడి. అందుకే ఈ పబ్‌పై దాడి చేసిన జూబ్లీహిల్స్ పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రును సస్పెండ్ చేయగా, ఏసీపీకి చార్జ్ మెమో ఇచ్చారు. 
 
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో దాదాపు అందరూ ప్రముఖుల వారసులే ఉన్నారు. ఇపుడు అధికారులు చర్యలు తీసుకోవడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. పబ్‌లో మాజీ డీజీపీ కుమార్తె, ఏపీకి చెందిన మాజీ ఎంపీ కుమారుడు, తెంగాణాకు చెందిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కుమారులు ఉన్నారు. అలాగే, పబ్‌లో లిక్విడ్ రూపంలో డ్రగ్స్ కూడా దొరికినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, అదుపులోకి తీసుకున్న వారిలో 12 మందిని మినహా మిగిలిన అందరినీ పోలీసులు నోటీసులిచ్చి పంపించేశారు. 
 
జూబ్లీహిల్స్ సీఐ సస్పెండ్ 
 
హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటళ్ళల్ రాడిసన్ బ్లూ ప్లాజాలో పుడ్డింగ్, మింక్ పబ్‌లపై ఆదివారం తెల్లవారుజామున జూబ్లీ హిల్స్ పోలీసులు ఆక్మికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో తెలుగు బిగ్ బాస్ టైటిల్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మెగా డాటర్ నిహారిక కొణిదెలతో పాటు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్ నిబంధనలను ఉల్లంఘించి, మూసివేసిన గంటల తర్వాత పబ్ నడపడంతో పోలీసులు పబ్‌పై దాడులు నిర్వహించాయి. ఆ సమయంలో పబ్‌లో ఉన్నవారందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి నుంచి వివరాలు సేకరించి వదిలివేశారు. స్టేషన్‌కు తరలించిన వారిలో సినీ సెలెబ్రిటీల పిల్లలు కూడా ఉండటంతో ఈ వ్యవహరంపై పోలీసు పెద్దలపై ఒత్తిడి పెరిగింది. దీంతో పబ్‌పై దాడి చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు చేపట్టారు. 
 
ఈ పబ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వ్యవహారంలో జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివచంద్రును పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే, ఏసీపీకి చార్జిమెమో జారీ చేశారు. ఈ పబ్‌పై దాడి వ్యవహారం ఇపుడు హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది హోటల్ సిబ్బంది ఉన్నారు.