ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (18:42 IST)

ఫుడింగ్ మింక్ పబ్ కేసుపై సీరియస్.. సీపీ అత్యవసర భేటీ

హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా నక్షత్ర హోటల్‌లోని ఫుడింగ్ మింక్ పబ్ వ్యవహారాన్ని హైదరాబాద్ నగర పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో హైదరబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీస్ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. 
 
ఈ ఫుడింగ్ మింక్ పబ్‌పై జూబ్లీ హిల్స్ పోలీసులు ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నిర్ణీత సమయం కంటే ఈ పబ్‌ను నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో అనేక సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ నిహారికలతో పాటు టీఎస్ మాజీ డీజీపీ కుమార్తె, కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమారులు తదితరులు ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. 
 
ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసులు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఎస్.ఐలు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్లు వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. 
 
అలాగే, ఫుడింగ్ మింక్ పబ్‌లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించారు. ఈ కేసు సంబంధించిన సాంకేతిక ఆధారాలపై వెస్ట్ జోన్ పోలీసులు దృష్టిసారించారు. మరోవైపు, ఈ కేసును నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.