శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (17:14 IST)

చంద్రయాన్-2: విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు ఇస్రోకు మళ్లీ సాధ్యమేనా?

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన ఫొటోలు తమకు లభించాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చెప్పింది. "ఇస్రోకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఫొటోలు లభించాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్ ల్యాండర్ థర్మల్ ఇమేజెస్ తీసింది" అని సంస్థ చీఫ్ కె.శివన్ అన్నారు. చంద్రయాన్-2లోని కెమెరాలు ల్యాండర్ లోపల ప్రజ్ఞాన్ రోవర్ ఉంటుందనే విషయాన్ని కూడా ధ్రువీకరించాయని కూడా చెప్పారు. దీంతో శుక్రవారం రాత్రి అసంపూర్తిగా మిగిలిపోయిన కలను భారత్ నెరవేర్చుకోగలదా అనే ఆశలు ఇప్పుడు మిణుకుమిణుకుమంటున్నాయి.

 
శుక్రవారం రాత్రి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగడానికి కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు.. గ్రౌండ్ స్టేషన్‌తో దాని కాంటాక్ట్స్ తెగిపోయాయి. విక్రమ్ ల్యాండర్‌తో కాంటాక్ట్ కావడానికి ఇస్రో అన్ని ప్రయత్నాలూ చేస్తోందని కె.శివన్ చెప్పారు. అయితే దేశంలోని కొందరు శాస్త్రవేత్తలు దానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ల్యాండర్‌తో ఇస్రో మళ్లీ కాంటాక్ట్ కావడం జరిగితే, అది అద్భుతమే అవుతుందని చెబుతున్నారు.

 
శాస్త్రవేత్త గౌహర్ రజా దీనిపై బీబీసీతో మాట్లాడారు. "అది చాలా కష్టం. మళ్లీ కాంటాక్ట్ ఏర్పరుచుకోవాలంటే ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా దిగడం చాలా అవసరం. అంతే కాదు.. దాని కాళ్లు ఉపరితలాన్ని తాకేలా అది ల్యాండ్ అయ్యుండాలి. దానిలోపల మనం కాంటాక్ట్ అయ్యే భాగం సరిగా పనిచేస్తూ ఉండాలి" అన్నారు.

 
"మరో ముఖ్యమైన విషయం ఏంటంటే విక్రమ్ ల్యాండర్ 50 వాట్ పవర్ జనరేట్ చేసే స్థితిలో ఉండాలి. దానికి ఉన్న సోలార్ ప్యానల్ సూర్యుడి వెలుతురు పడేందుకు అనువుగా ఉండాలి. ఆర్బిటర్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అవుతుందని పెద్దగా ఆశలు పెట్టుకోలేం" అని రజా చెప్పారు. అయితే ఇస్రో ఇందులో ఎంతవరకూ సఫలీకృతం అవగలదనేది ముందు ముందు తెలుస్తుంది.

 
'థర్మల్' ఇమేజ్ అంటే ఏంటి?
చంద్రయాన్-2 ల్యాండర్ థర్మల్ ఇమేజ్ గురించి కె.శివన్ మాట్లాడారు. ఆర్బిటర్‌లో ఉన్న కెమెరాలు ఆ థర్మల్ ఫొటోలు తీశాయని తెలిపారు. సున్నా కంటే ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఏ వస్తువు నుంచి అయినా రేడియేషన్ వస్తూ ఉంటుంది. ఆ వస్తువు బాగా వేడెక్కి, దాని నుంచి కళ్లకు కనిపించేంత వెలుగు వచ్చేవరకూ, ఆ రేడియేషన్ కంటికి కనిపించదు. అంటే లోహాలను కాల్చినపుడు అవి వేడెక్కుతాయి. బాగా కాలిన తర్వాత అది ఎర్రబడడం మొదలవుతుంది. కానీ సాధారణ ఉష్ణోగ్రత వద్ద కూడా దానిలో రేడియేషన్ ఉంటుంది. అలాంటి, థర్మల్ రేడియేషన్‌ను ఆర్బిటర్‌లో ఉన్న కెమెరాలు కాప్చర్ చేస్తాయి. దానిని ఒక ఫొటోగా మారుస్తాయి. ఆ ఫొటోను 'థర్మల్ ఇమేజ్' అంటారు. ఈ ఫొటో కాస్త మసగ్గా ఉంటుంది. దాని గురించి వివరించాల్సి ఉంటుంది. అది మనం మామూలుగా మన కెమెరాలతో తీసే ఫొటోలా ఉండదు.

 
ల్యాండర్ క్షేమంగా ఉందా, లేక ప్రమాదానికి గురైందా?
ఇక, ల్యాండర్ అసలు క్షేమంగా ఉందా, లేక ఏదైనా ప్రమాదానికి గురైందా అనే ప్రశ్న కూడా వస్తుంది. "ఆదివారం వరకూ అందిన సూచనల ప్రకారం ల్యాండర్ పూర్తిగా విరిగిపోలేదు. అది విరిగి ముక్కలైపోయుంటే, ల్యాండర్ ఫొటోలు తీసిందని మనం చెప్పడం సాధ్యం కాదు" అని శాస్త్రవేత్త గౌహర్ రజా చెప్పారు. హార్డ్ లాండింగ్‌ వల్ల ల్యాండర్‌కు ఎంత నష్టం జరిగింది అనే విషయం గురించి కె.శివన్‌ స్పష్టత ఇవ్వలేదు. అంటే చంద్రుడి ఉపరితలాన్ని తాకినప్పుడు ల్యాండర్ పూర్తిగా నాశనం కాకుండా ఉండేలా దాని స్పీడ్ చాలావరకూ తగ్గించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంటే దానర్థం చంద్రుడి ఉపరితలంపై దిగనంతవరకూ దాని స్పీడు తగ్గుతూ వచ్చింది అని గౌహర్ రజా చెప్పారు. ల్యాండర్‌కు ఎంత నష్టం జరిగింది అనేది ఆర్బిటర్ ద్వారా తీసిన ఫొటోలను విశ్లేషించిన తర్వాతే తెలుస్తుంది. 

 
చివరి నిమిషంలో ఏం జరిగుంటుంది?
"2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు మనకు ల్యాండర్‌తో కాంటాక్ట్స్ తెగిపోయాయి. అంటే, అంత దూరం నుంచి చంద్రుడి ఉపరితలంపైకి చేరుకునేవరకూ దాని గురించి మనకు సరైన సూచనలు లభించలేదు" అని రజా చెప్పారు. "ఇప్పుడు మనకు ల్యాండర్ ఫొటోలు లభించాయి. అలాంటప్పుడు అది దిగుతున్నప్పుడు, చివరి క్షణాల్లో ఏం జరిగుంటుంది అనేది ఇప్పుడు మనం అంచనా వేయవచ్చు" అన్నారు.

 
చివరి క్షణంలో ల్యాండర్ స్పీడ్ కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదని, ల్యాండర్‌కు ఎలాంటి నష్టం కలగకుండా, దాని కాళ్లు సరిగ్గా కిందకు వచ్చేలా, ఒక నిర్ధారిత వేగంలో ఉపరితలంపై దించడం అనేది చాలా పెద్ద సవాలు అయ్యుంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అనుకుంటూ వచ్చారు.

 
స్పీడ్ కంట్రోల్
సాప్ట్ ల్యాండింగ్ కోసం ల్యాండర్ స్పీడును గంటకు 21 వేల కిలోమీటర్ల నుంచి గంటకు 7 కిలోమీటర్లకు తగ్గించాల్సి ఉంటుంది. ఇస్రో నుంచి స్పీడ్ కంట్రోలింగ్‌లోనే పొరపాటు జరిగింది. దాంతో దాని సాఫ్ట్ ల్యాండింగ్ సాధ్యం కాలేదు. ల్యాండర్‌కు నాలుగు వైపులా నాలుగు రాకెట్లు లేదా ఇంజన్లు ఉంటాయి. స్పీడ్ తగ్గించడానికి వాటిని ఫైర్ చేస్తారు. వేగంగా దిగే మండే రాకెట్లు దానిని పైకి నెట్టడం వల్ల ల్యాండర్ స్పీడు తగ్గుతుంది.

 
ఇక చివర్లో ల్యాండర్‌ మధ్య ఉన్న రాకెట్‌ను మండిస్తారు. చంద్రుడికి పైన 400 మీటర్ల వరకూ ల్యాండర్‌ను జీరో స్పీడులో తీసుకురావడం దాని పని. కానీ అలా జరగలేదు. ఇక్కడ సమస్య 2 కిలోమీటర్ల కంటే ఎత్తు నుంచే మొదలైంది.

 
ఏడేళ్ల వరకూ ఎలా పనిచేస్తుంది?
ఇస్రో చీఫ్ కె.శివన్ శనివారం డీడీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "చంద్రయాన్-2 ఆర్బిటర్ ఏడేళ్ల వరకూ పనిచేయగలదని, అయితే మా లక్ష్యం ఏడాది మాత్రమే" అని చెప్పారు. అయినా అది ఎలా సాధ్యం? దీనికి సమాధానంగా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ పని చేయడానికి రెండు రకాల శక్తులు అవసరం అవుతాయని గౌహర్ రజా చెప్పారు. ఈ మూడింటినీ నడిపించడానికి అవసరమైన మొదటి శక్తి, ఎలక్ట్రానిక్ పవర్. దానికోసం ఆ పరికరాలపై సోలార్ ప్యానెల్స్ బిగిస్తారు. అవి సూర్యరశ్మి గ్రహించడం వల్ల వాటికి నడిచే శక్తి అందుతుంది.

 
ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ దిశలు మార్చడానికి మరో రకం శక్తిని ఉపయోగిస్తారు. అదే ఇంధనం. ఇంధనం లేకుంటా వాటి దిశను మార్చడం సాధ్యం కాదు. ల్యాండర్, రోవర్ ఎలా ఉన్నాయనే విషయం ఇంకా తెలీకపోయినా, మన ఆర్బిటర్‌లో ఇంధనం ఇంకా ఉంది. అందుకే అది ఏడేళ్ల వరకూ పనిచేయగలదు.