శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 2 మార్చి 2021 (16:19 IST)

కోవిడ్-19: మలద్వారం టెస్టులు చేస్తున్న చైనా, అభ్యంతరం చెప్పిన జపాన్

చైనాలోకి ప్రవేశించేటప్పుడు తమకు మలద్వారం స్వాబ్ పరీక్ష చేశారని కొందరు జపనీయులు ఫిర్యాదు చేశారు. చైనాలో అడుగు పెట్టగానే తమ దేశ పౌరులకు మలద్వారం నుంచి శాంపిల్స్ తీసుకుని కోవిడ్-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహించడం ఆపాలని జపాన్ కోరింది.

 
ఈ విధానం "మానసిక క్షోభకు" గురి చేస్తోందని కొందరు ఫిర్యాదు చేశారని జపాన్ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని చాలావరకూ అదుపులోకి తెచ్చిన చైనా జనవరిలో మలద్వారం (ఆనల్) స్వాబ్ టెస్టులు చేయడం ప్రారంభించింది. అమెరికా దౌత్యవేత్తలకు కూడా ఇలాంటి పరీక్షలు చేశారని గతవారం అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, చైనా ఆ వార్తలను ఖండించింది.

 
"మలద్వారం స్వాబ్ టెస్టుల వల్ల తాము మానసిక వేదన అనుభవించామని కొందరు జపనీయులు చైనాలోని మా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఎంత మంది జపాన్ పౌరులు ఈ టెస్టుల బారిన పడ్డారో ఇంకా తెలియదు" అని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ కట్సునోబు కటో తెలిపారు. చైనాలో అడుగు పెట్టినవారికి, క్వారంటీన్‌లో ఉన్న కొందరికి ఈ ఆనల్ స్వాబ్ టెస్టులు నిర్వహించారు.

 
"ఈ టెస్టులు ఎంత ఉపయోగకరం అనేది ఇంతవరకూ ప్రపంచంలో ఎవరూ ధృవీకరించలేదు" అని కటో అన్నారు. ఈ టెస్టులు నిర్వహించొద్దంటూ బీజింగ్‌లోని జపాన్ రాయబార కార్యాలయం చేసిన వినతికి చైనా ఇంతవరకూ స్పందించలేదు. ఆనల్ స్వాబ్ టెస్టుల వల్ల "వైరస్ సోకినవారిని గుర్తించే రేటు పెరుగుతుందని" కొందరు స్థానిక చైనా నిపుణులు అంటున్నారు.

 
అయితే, ఈ పద్ధతిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ముక్కు ద్వారా చేసే స్వాబ్ టెస్టులతో పోలిస్తే మలద్వారం స్వాబ్ టెస్టులు అంత సమర్థవంతం కావని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు ఈ పద్ధతిని ప్రారంభించిన తొలిరోజుల్లో చైనా ప్రభుత్వ మీడియా ప్రచురించింది.

 
కరోనా వైరస్ నోటి ద్వారా లేదా ముక్కు ద్వారానే వ్యాపిస్తుంది కాబట్టి ఇంతవరకూ అమలులో ఉన్న కోవిడ్ పరీక్షలే సమర్థవంతమైనవని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆనల్ స్వాబ్ టెస్టుల్లో 3-5 సెమీ (1.2-2.0 ఇంచులు) కాటన్ స్వాబ్‌ను మలద్వారంలోకి దూర్చి మెల్లిగా తిప్పుతూ శాంపిల్స్ సేకరిస్తారు.