శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (15:43 IST)

నోటా గుర్తుకే మా ఓటు అంటున్న సెక్స్ వర్కర్లు.. ఎందుకంటే...?

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారపర్వం నిర్ణీత షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే ఆగిపోయింది. దీనికి కారణం ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలే. ఈ హోరులో హింసాత్మక ఘటనల నడుమ ఎన్నో గొంతుకలు వినిపించకుండా పోయాయి. అయితే, ఒక చిన్న సముదాయానికి చెందిన మహిళలు మాత్రం తమ ఆత్మగౌరవం నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వాళ్లే బెంగాల్‌లోని సెక్స్ వర్కర్లు. ఈ ఎన్నికల్లో తామంతా నోటా మీట నొక్కుతామని ప్రకటించారు. అందుకు కారణాలేంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్ధాం. 
 
దేశంలోనే అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాల్లో కోల్‌కతాలోని సోనాగచ్చి ప్రాంతం ఒకటి. అయితే ఇంత రాజకీయ వేడిలోనూ సోనాగచ్చి పేరు వినిపిస్తోందంటే అందుకు మరో కారణం ఉంది. దాదాపు 18 వేల మంది వరకు ఉండే మహిళా సెక్స్ వర్కర్లు, ఈసారి ఏ ఒక్క అభ్యర్ధికీ ఓటు వేయబోమని, మూకుమ్మడిగా నోటా బటన్ నొక్కుతామని అంటున్నారు. కేవలం కోల్‌కతా నుంచే కాదు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెక్స్ వర్కర్లంతా వీరికి జైకొట్టారు. 
 
'మేము రోజూ పనిచేసే కూలీలం. ఇంటి పనులు చేసుకునే మహిళలను కూలీలుగా గుర్తించినపుడు, మమ్మల్ని ఎందుకు గుర్తించరు? ఓట్లు అడగటానికి వచ్చే వాళ్లందరూ భారీ హామీలను గుప్పిస్తారు. కానీ, ఇప్పటివరకూ చేసిందేమీ లేదు. అందుకే ఈసారి మేము నోటాను ఎంచుకోబోతున్నాం' అని 'ఉష మహిళ' సహకార సంఘం కార్యదర్శి రీటా రాయ్ అంటున్నారు. 
 
ఈ సెక్స్ వర్కర్లకు శాశ్వత చిరునామా లేనికారణంగా గత 2004 వరకు జరిగిన ఎన్నికల్లో ఓటు వేయలేక పోయారు. ఆ తర్వాత తమ సహకార సంఘంలో తమ ఇళ్ల చిరునామాలను నమోదు చేయించుకుని ఓటరు జాబితాలో పేరు చేర్పించుకున్నారు. అలా నమోదు చేసుకున్న ఓటర్లు దాదాపు 18 వేల మంది ఉన్నారు. బెంగాల్ మొత్తంగా వారి కుటుంబ సభ్యులతో కలిపి చూస్తే వారి సంఖ్య 4.50 లక్షల వరకు ఉండొచ్చు.
 
అసలు వీరి డిమాండ్లు ఏంటి? 
సెక్స్ వర్క్ అధారంగా ఉండే పనులను నేర జాబితా నుంచి తొలగించాలన్నది వీళ్ల ప్రధాన డిమాండ్. అలానే, కార్మిక శాఖ తమను కార్మికులుగా గుర్తించాలని, ప్రత్యేక స్వయం పాలిత యంత్రాంగాన్ని రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేసి మహిళల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు. కొన్నేళ్లుగా చేస్తున్న వీరి డిమాండ్లను ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వినిపించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. 
 
"మేము ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నాం. గతంలో ఎదో ఒక పార్టీకి మా ఓట్లు పడేవి. కానీ మా డిమాండ్లను ఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, వారు పార్లమెంటు ముందు పెడతారు. దాంతో మా హక్కులు మాకు లభిస్తాయి అనుకునే వాళ్లం. కానీ ఇప్పటివరకు అలా జరగలేదు'' అని కుతుల్ సింగ్ చెప్పారు.
 
నోటాకు ఓటేసి ఏం సాధిస్తారు? 
అయితే, వీరంతా నోటా మీట నొక్కడం వలన రాజకీయ పార్టీలపై ఏదైనా ప్రభావం ఉంటుందా? అనే అంశంపై ఆమె మాట్లాడుతూ, "నాయకులకు ఇదొక రకమైన తలనొప్పే కదా. ఇంత భారీ సంఖ్యలో ఓట్లను కోల్పోతే ఖచ్చితంగా వాళ్లకు ఇబ్బందే" అని దర్బార్ సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ కుతుల్ హల్దర్ అభిప్రాయపడ్డారు.
 
"దేశవ్యాప్తంగా చూస్తే వారి సంఖ్య రెండున్నర కోట్ల వరకు ఉంది. అయితే, వారి మధ్య సమన్వయం, వారిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు అంత బలంగా జరగడం లేదు. ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ సంస్థ దాదాపు 30 లక్షల మంది సెక్స్ వర్కర్లకు ప్రతినిధిగా ఉన్నారు. కానీ, కలిసి ఒక్కతాటిపైకి వచ్చే వారి సంఖ్య తక్కువే" అని దర్బార్ మహిళా సంఘం ముఖ్య సలహాదారు సమ్రజిత్ జన అంటున్నారు. ప్రస్తుతం బెంగాల్లో వీరి సంఖ్య రాజకీయ పార్టీలను అంతగా ప్రభావితం చేయలేకపోవచ్చు. కానీ, జాతీయ స్థాయిలో ఒక్కటైతే ఆ తీవ్రత ఖచ్చితంగా తెలుస్తుంది.