శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: బుధవారం, 24 జులై 2019 (19:04 IST)

అమరావతి: రాజధాని ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఏఐఐబీ... ఏపీ రాజధాని గతి అంతేనా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చే ప్రణాళికల నుంచి ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ) తప్పుకుందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అమరావతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించే ఆలోచన విరమించుకున్నట్లు శుక్రవారం ప్రపంచ బ్యాంకు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు.. చైనా సారథ్యంలో నడిచే ఆసియా బ్యాంకు కూడా ప్రపంచబ్యాంకు బాటలోనే నిర్ణయం తీసుకుంది. 
 
ప్రపంచ బ్యాంకు ఎందుకు వెనక్కు తగ్గింది
అమరావతికి రుణం విషయంలో భారత ప్రభుత్వమే తన విజ్ఞప్తిని వెనక్కు తీసుకుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి సుదీప్ ముజుందార్ అప్పుడు బీబీసీతో చెప్పారు. "ప్రభుత్వ (భారత) నిర్ణయంతో దీన్ని పక్కన పెట్టాలని ప్రపంచ బ్యాంకు బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు" అన్నారు.
 
"ప్రపంచ బ్యాంకు లేనిపోని చికాకులు కలిగిస్తోందనే భారత ప్రభుత్వం రుణ దరఖాస్తును వెనక్కు తీసుకుంది" అని భారత ఆర్థిక వ్యవహారాల శాఖలోని ఒక ఉన్నతాధికారి అప్పుడు పేర్కొన్నారు.
 
ఏఐఐబీ ఏం చెప్తోంది
''అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాలు మరియు సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు సమకూర్చే అంశాన్ని ఏఐఐబీ ఇక పరిగణలోకి తీసుకోవట్లేదు'' అని బ్యాంకు అధికార ప్రతినిధి లారెల్ ఆస్ట్‌ఫీల్డ్ బీబీసీతెలుగుకు తెలిపారు. అయితే.. ''ఏఐఐబీ అనేది నాకు తెలిసినంతవరకూ స్వతంత్ర సంస్థ కాదు.


ప్రపంచ బ్యాంకు, ఏఐబీబీ కలిసి అమరావతికి నిధులు సమకూరుస్తున్నాయి. కాబట్టి.. ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టును వదిలేస్తే.. సహజంగా ఏఐఐబీ కూడా అదే బాటలో నడుస్తుంది. అందుకు కాస్త సమయం పడుతుంది.. అంతే'' అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు బీబీసీ ప్రతినిధితో పేర్కొన్నారు.
 
మరొక సీనియర్ అధికారి కూడా ఇదే విషయం చెప్పారు. ''అమరావతి ప్రాజెక్టు.. ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ ఉమ్మడిగా నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టు. ప్రపంచ బ్యాంకు గురించి మేం ఏం చెప్పామో.. అదే యధాతథంగా ఏఐఐబీకీ వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉంటాయి. తీవ్ర ప్రతికూల పరిణామాలు చుట్టుముట్టి ఉన్న ఈ ప్రాజెక్టు ఒక్కదాని నుంచే అవి తప్పుకుంటున్నాయి'' అని వివరించారు.
 
అమరావతి నగర నిర్మాణ ప్రాజెక్టుకు రుణం కోసం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏపీ ప్రభుత్వం తరపున రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు పంపింది.
 
ఏపీ ప్రభుత్వం ఎన్ని నిధులు కోరింది?
మొత్తం ప్రాజెక్టు వ్యయం 715 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 4,923 కోట్లు). ఇందులో 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,065 కోట్లు) రుణంగా ఇవ్వాలని ప్రపంచ బ్యాంకును ఏపీ ప్రబుత్వం కోరింది. మిగతా నిధులు ఏఐఐబీ నుంచి వస్తాయని ప్రభుత్వం ఆశించింది. అయితే.. అమరావతి ప్రాజెక్టును విరమించుకుంటున్నట్టు ప్రపంచబ్యాంకు నిర్ణయం తీసుకోవటంతో తాజాగా ఏఐఐబీ కూడా అదే నిర్ణయం ప్రకటించింది.