గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: గురువారం, 18 జులై 2019 (16:01 IST)

సీఎం జగన్ దేవుడు... జనసేన ఎమ్మెల్యే రాపాక పొగడ్త...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరని కోర్కెలు తీర్చే దేవుడు అని కొనియాడారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందని ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు.
 
తమ బతుకులు బాగుపడాలంటే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని రైతులు ఆశించారనీ, వారి ఆశలు నెరవేరాయన్నారు. రైతులకు ఏం కావాలో అవన్నీ జగనన్న ఇస్తున్నారంటూ తమ ప్రాంత రైతులు అన్నారన్నారు. అంతేకాదు... బుధవారం నాడు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... "కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని మత్య్సకారులు చెబుతున్నారు. మత్స్యకారులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిధులు కేటాయించడం సంతోషం. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు" అని రాపాక చెప్పారు.
 
జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పొగడ్తల జల్లు కురిపించడంతో తెదేపా నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.