1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (10:32 IST)

పులివెందుల నుంచి హైదాబారాబాద్‌కు కదిలిన అవినాష్ రెడ్డి

avinash reddy
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నుంచి మరోమారు పిలుపువచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం ఉదయం పులివెందుల నుంచి హైదరాబాద్ నగరానికి బయలుదేరారు. ఆయన వెంట వైకాపాకు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు భారీగా వైకాపా నేతలు కూడా హైదరాబాద్ నగరానికి కదిలారు. సీబీఐ అధికారుల పిలుపు మేరకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. 
 
కాగా, ఈ కేసులో ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో నాలుగుసార్లు విచారించిన సీబీఐ అధికారులు.. సాక్షిగానే వాంగ్మూలాలు నమోదు చేశారు. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడంతో వైకాపా శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 
 
వైఎస్‌ భాస్కర్ రెడ్డిని ఆదివారం పులివెందులలో అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్‌లోని సీబీఐ జడ్జి నివాసంలో అధికారులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్‌ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. 
 
హత్య తర్వాత సహనిందితులు డి.శివశంకర్‌ రెడ్డి, టి.గంగిరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డితో కలిసి ఆధారాల్ని చెరిపివేయడంలో భాస్కర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని అభియోగం మోపారు. దీంతో తొలిసారిగా అవినాష్‌ రెడ్డి నిందితుల జాబితాలో ఉన్నట్లు బహిర్గతమైంది.