హిజ్రాలకు కూడా అడ్మిషన్లు కల్పిస్తాం : ఢిల్లీ విశ్వవిద్యాలయం
అటు ఆడకూ, ఇటు మగకూ చెందని విభాగనికి చెందిన హిజ్రాలకు కూడా ప్రవేశాలు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో హిజ్రాలకు కూడా అడ్మిషన్లను ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఢిల్లీ వర్సిటీ అధికారులు, వచ్చే యేడాది నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లోనూ వారికి ప్రవేశాలు కల్పిస్తామని ప్రకటించారు.
వీరికి ఓబీసీ కోటాలోనే ప్రత్యేక కేటగిరీ కింద అడ్మిషన్లు లభించనున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఢిల్లీ వర్శిటీ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఢిల్లీ వర్సిటీ ప్రకటనపై హర్షం వెలిబుచ్చిన హిజ్రాల సంఘం, ప్రవేశాలతో పాటు వర్సిటీలో తమకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఢిల్లీ వర్సిటీ నిర్ణయం తమకు మెరుగైన జీవితాలను ప్రసాదించేదేనని వ్యాఖ్యానించింది. అయితే, తమపట్ల సమాజం వైఖరిలో మార్పు వచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.