గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (12:44 IST)

నీట్, జేఈఈ పరీక్షలు.. ఆందోళనకు దిగిన విపక్షాలు.. సోనూ సపోర్ట్

కరోనా వైరస్ ఉధృతంగా వున్న నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని, పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సెప్టెంబర్‌లో నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. 
 
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) కార్యకర్తలు నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
 
కర్ణాటకలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నేతలు నిరాహార దీక్షలకు దిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్, జేఈఈ పరీక్షలు సెప్టెంబర్‌లో నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు శాస్త్రిభవన్ ఎదుట ఆందోళన చేశారు. తమిళనాడులో కూడా కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయంపై ఆందోళనలకు దిగారు.
 
కరోనా పరిస్థితుల నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన  బాలీవుడ్ నటుడు సోనూ సూద్  ప్రస్తుత పరిస్థితుల రీత్యా తనదైన శైలిలో కార్య రంగంలోకి దిగిపోయారు. 
 
ఈ పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించి తీరుతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ  కరాఖండిగా తేల్చి చెప్పింది. దీంతో విద్యార్థులకు అండగా నిలిచేందుకు నిర్ణయించుకున్న సోనూ సూద్ అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు.  
 
ఒకవైపుకోవిడ్-19 రిస్క్, మరోవైపు తండ్రి పేదరికం, లోన్ల బెడద తదితర ఆర్థిక కష్టాల నేపథ్యంలో చాలాదూరంలో ఉన్న పరీక్ష కేంద్రానికి ఎలా వెళ్లాలి.. దయచేసి సాయం చేయండి అంటూ కన్నీరు మున్నీరవుతున్న విద్యార్థి ఆవేదనను సోనూ షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్ తాజా నిర్ణయం తీసుకున్నారు.  
 
నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణ ఖాయమైతే..ఆయా ప్రాంతాల విద్యార్థులు పరీక్షా కేంద్రాలను చేరుకోవడానికి కావల్సిన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా బీహార్, అస్సాం, గుజరాత్‌లోని వరద బాధిత ప్రాంతాలలో పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులందరికీ తానున్నాంటూ భరోసా ఇచ్చారు. బాధిత విద్యార్థులు దీనికి సంబంధించిన సమాచారాన్ని తనకు అందించాలని, ఏ ఒక్కరు కూడా ఈ పరీక్ష మిస్ కావడానికి వీల్లేదని ట్వీట్ చేశారు.