శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 మే 2020 (08:54 IST)

లారెన్స్ నడిపే ట్రస్టులో 20 మందికి కరోనా పాజిటివ్

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ఓ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో అనేక మంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. అలాగే, ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఈ ట్రస్ట్ చెన్నై నగరంలోని అశోక్ నగర్‌లో ఉంది. అయితే, ఈ ట్రస్టులో ఉండే వారిలో 20 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో గ్రేటర్ చెన్నై మున్సిపల్ అధికారులు ట్రస్టు కార్యాలయాన్ని మూసివేశారు. 
 
చెన్నైలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో కరోనా నిరోధక చర్యల్లో భాగంగా చెన్నై కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా, లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందుతున్న వారికి కూడా ఈ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ పరీక్షల్లో పలువురిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారి నమూనాలు సేకరించి పరీక్షించగా, 20 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించామని వెల్లడించిన గ్రేటర్ చెన్నై అధికారులు, ట్రస్ట్ గెస్ట్ హౌస్‌ను మూసివేశారు. ఆ ప్రాంతంలో క్రిమి సంహారాలు చల్లి, ట్రస్ట్ హౌస్ ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.