మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (09:59 IST)

నిర్భయ దోషులకు కేంద్రం షాక్.. తిరస్కరించిన పది రోజుల్లో ఉరి తీయాల్సిందే..

నిర్భయ దోషులకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురైన పది రోజుల్లో నిందితులను ఉరితీసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పైగా, ఈ కేసులోని దోషులు ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేస్తూ శిక్షను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనీ, బాధితురాలి తరపున కూడా ఆలోచన చేయాలని కోరింది. 
 
నిర్భయ కేసులో దోషులుగా తేలినవారికి మరణశిక్షలను అమలు చేయడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై మరణదండన విధించబడిన ఏ దోషి పేరిటైనా, డెత్‌వారెంట్ జారీ అయితే, శిక్ష అమలు వారం రోజుల్లో జరిగిపోవాలని కోరుతూ, ఇందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఇదే అంశంపై ఒక పిటిషన్ దాఖలు చేసింది. 
 
తమకు విధించిన ఉరిశిక్షను వాయిదా వేయించుకునేలా, రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతికి క్షమాభిక్ష వంటి పలు చట్టపరమైన అవకాశాలను నిర్భయ దోషులు వినియోగించుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
 
ఉరిశిక్ష విషయంలో దోషుల హక్కుల గురించి కాకుండా, బాధితుల తరపున ఆలోచిస్తూ, ఈ మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తమ పిటిషన్‌లో కేంద్రం అభిప్రాయపడింది. దోషులు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే, సహదోషుల రివ్యూ, క్యూరేటివ్ తదితర పిటిషన్లు ఎన్ని ఉన్నా, వాటిని పక్కన బెట్టాలని, అన్ని కోర్టులు, ప్రభుత్వాలు, జైళ్లు ఈ నిర్ణయాన్ని అమలు చేసే ఆదేశాలు ఇవ్వాలని కోరింది. రివ్యూ పిటిషన్ తిరస్కరణకు గురైతే, క్యూరేటివ్ పిటిషన్ దాఖలుకు నిర్ణీత కాలపరిమితిని విధించాలని సూచించింది.