1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:30 IST)

ఏపీకి సౌత్ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ప్రతి రోజూ కొత్తగా పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. శుక్రవారం కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తికి మరింత కట్టుదిట్టంగా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను దిగుమతి చేసుకుంది. సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో రాష్ట్రానికి వచ్చిన ఈ కరోనా టెస్టింగ్ కిట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. 
 
ఈ టెస్టింగ్ కిట్లు 10 నిమిషాల లోపే ఫలితాన్నివ్వగలవు. వీటి సాయంతో ఏకకాలంలో వేలమందికి కరోనా టెస్టులు చేయవచ్చని అధికారులు అంటున్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కొరియా టెస్టింగ్ కిట్లను పంపిస్తామని, భారీ సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.