బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (08:20 IST)

ఏపీలో టెన్షన్ - టెన్షన్ : సచివాలయ ఉద్యోగికి కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1259 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా మారిపోయాయి. 75 శాతం కేసులు ఈ మూడు జిల్లాల్లోనే నమోదు కావడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వదంతులు నిజమైతే మరింత ఆందోళన కలిగించే అంశంగా భావింవచ్చు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... సచివాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులకు సమాచారం వచ్చింది. కానీ, ఆ ఉద్యోగి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం అధికారులు గాలిస్తున్నారు. 
 
ఇది మరింత ఆందోళన కలిగించే అంశంగా ఉంది. పైగా, అతని ఆచూకీ గురించిన వివరాలు తప్పుగా ఇస్తున్నాడు. చివరకు అతని ఆచూకీ తెలుసుకుని అదుపులోకి తీసుకుని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కానీ, అతను కాంటాక్ట్ అయిన వ్యక్తులను గుర్తించడం కూడా ఇపుడు కష్టతరంగా మారింది. కాగా, రెండు రోజుల ఏపీ రాజ్‌భవన్‌లో పని చేసే నలుగురు ఉద్యోగులకు ఈ కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే.