మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (21:33 IST)

ఆంధ్రప్రదేశ్‌లో 8 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు... కరోనా మరణాలు ఎన్ని?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా లెక్కల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 3,765 కొత్త కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 8,00,684కి చేరింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 31,721 మాత్రమే. కాగా, మరో 4,281 మందికి కరోనా నయం అయింది. ఇప్పటివరకు 7,62,419 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు వేగంగా కుదుటపడుతుండటం శుభపరిణామం. గత కొన్నిరోజులుగా కొత్తగా వెల్లడవుతున్న కేసుల సంఖ్య, ఒక్కరోజు మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. తాజాగా, ఏపీలో 20 మంది కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 6,544కి పెరిగింది.
 
కాగా, ప్రస్తుతం జిల్లాల వారీగా యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 1723, చిత్తూరు 3470, ఈస్ట్ గోదావరి 5703, గుంటూరు 3703, కడప 1926, కృష్ణ 3348, కర్నూలు 687, నెల్లూరు 495, ప్రకాశం 2730, శ్రీకాకుళం 1298, విశాఖపట్టణం 2205, విజయనగరం 717, వెస్ట్ గోదావరి 3715 చొప్పున ఉన్నాయి. 
 
మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 54,366 మందికి కరోనా నిర్ధారణ అయిందని  పేర్కొంది. అదే సమయంలో 73,979 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,61,312కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 690 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,17,306 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 69,48,497 మంది కోలుకున్నారు. 6,95,509 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
కాగా, దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పది కోట్లు దాటడం గమనార్హం. నిన్నటి వరకు మొత్తం 10,01,13,085 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 14,42,722 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.