శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (17:50 IST)

చికెన్ తింటే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి.. వాట్సాప్​ గ్రూప్స్​లో వైరల్​

కోళ్ల ఫారంల ద్వారా బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి చెందుతుంది. కొన్ని రోజుల పాటు చికెన్​ తినకపోవడమే మంచిది. చికెన్​కు దూరంగా ఉండండి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను సురక్షితంగా కాపాడుకోండి' అనే పోస్ట్​ వాట్సాప్​ గ్రూప్స్​లో వైరల్​ అవుతుంది. 
 
చాలా మంది ఇది నిజమా? కాదా? అని తెలుసుకోకుండానే ఇతరులకు షేర్​ చేస్తున్నారు. గతేడాది కరోనా ఫస్ట్​వేవ్​ సమయంలోనూ చికెన్​పై ఇలాంటి ప్రచారమే జరిగింది. చికెన్​ తింటే కరోనా సోకుతుందన్న ప్రచారంతో వినియోగం భారీగా పడిపోయింది. ఫలితంగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. దీని నుంచి కోలుకోవడానికి పౌల్ట్రీ పరిశ్రమకు చాలా సమయమే పట్టింది.
 
ఇప్పుడు బ్లాక్​ ఫంగస్​ విషయంలోనూ ఇలాంటి ఫేక్​ న్యూస్​ వైరల్ అవుతోంది. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఫాక్ట్​ చెక్ స్పష్టతనిచ్చింది. 'చికెన్​ తింటే బ్లాక్​ ఫంగస్​ వస్తుందన్న వార్తల్లో నిజం లేదు. ఈ ఇన్ఫెక్షన్ కోళ్ల నుంచి మానవులకు వ్యాపిస్తుందన్న దానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అందువల్ల నిస్సందేహంగా చికెన్​ తినవచ్చు" అని ట్వీట్ చేసింది.
 
కాగా, ఈ అంశంపై తాజాగా ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) సీనియర్​ సైంటిస్ట్​ డాక్టర్​ అపర్ణ ముఖర్జీ స్పందించారు. వాతావరణంలో ఉండే బ్లాక్​ ఫంగస్​ కోళ్లకి వస్తుందని, ఆ కోళ్ల ద్వారా మనుషులకు సోకుతుందన్న వాదనలో అర్థం లేదని చెప్పారు. బ్లాక్​ ఫంగస్​ అంటువ్యాధి కాదు, అలాంటప్పుడు జంతువుల నుంచి కోళ్లకు ఎలా సోకుతుందని ఆమె అన్నారు. కాబట్టి చికెన్​ తినేందుకు భయపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.