శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 1 జూన్ 2021 (15:37 IST)

ఆంధ్రప్రదేశ్: మధుమేహం లేని, స్టెరాయిడ్లు వాడని వారికీ బ్లాక్ ఫంగస్ - ప్రెస్ రివ్యూ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,179 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం వెల్లడించారని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది. ‘‘ముక్కు, నోట్లో తలెత్తే మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) మధుమేహులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను, రోగనిరోధశ శక్తి తక్కువగా ఉన్నవారినీ కబళిస్తోంది.

 
బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో పురుషులు 780 మంది కాగా, మహిళలు 399 మంది. బాధితుల్లో 743 (63.01%) మంది మధుమేహం ఉన్నవారు. 251 (21.28%) మంది రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, 130 (11.02%) మంది ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు’’ అని ఈనాడు రాసింది. ‘‘కరోనా ఇన్‌ఫెక్షన్‌, మధుమేహం ఉండటం, స్టెరాయిడ్‌ల వినియోగం బ్లాక్‌ఫంగస్‌ రావడానికి ప్రధాన కారణాలవుతున్నాయి.

 
ఈ వ్యాధితో ఆసుపత్రుల్లో చేరిన వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించినప్పుడు దాదాపు 80 శాతం మంది కొవిడ్‌ బారినపడి 3 వారాలపాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్లు, ఎక్కువ రోజులు ఆక్సిజన్‌పై ఉన్నట్లు తేలింది. అయితే రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ బారినపడిన వారిలో ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందినవారి కంటే పొందనివారే ఎక్కువ మంది కావడం గమనార్హం. అలాగే స్టెరాయిడ్లు వాడినవారి కంటే వాడని వారికే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుండటం కొత్త కోణం’’ ఆ అని పత్రిక చెప్పింది.

 
‘‘విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన 35 ఏళ్ల యువకుడు బ్లాక్‌ఫంగస్‌ బారినపడ్డాడు. అతనికి రక్తపోటు, మధుమేహం కూడా లేవు. వైరస్‌లో కొత్త స్ట్రెయిన్లు రావడం వల్ల శరీరంలోకి వైరస్‌ చేరిన వెంటనే పలువురిలో క్లోమం (పాంక్రియాస్‌)పై ప్రభావం చూపుతోంది. దీనివల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి ఎక్కువై రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతున్నాయి.

 
అలాగే కొందరిలో ఐరన్‌ స్థాయి పెరగడం కూడా కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ఆక్సిజన్‌ అందించే పైపులు, మాస్కుల్లో ఫంగస్‌ చేరడం వల్ల కూడా పలువురు కొవిడ్‌ బాధితులు బ్లాక్‌ఫంగస్‌ బారినపడినట్లు భావిస్తున్నార’’ని ఈ కథనంలో ఈనాడు వివరించింది.