1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (09:55 IST)

వామ్మో వైరస్‌లు.. దేశంలో తొలి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు

ఓ వైపు దేశంలో కరోనా పంజా విసురుతోంది. మరో వైపు బ్లాక్‌ ఫంగస్‌తో పాటు వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు సైతం రికార్డవుతున్నాయి. తాజాగా స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ వెలుగు చూసింది. దేశంలోనే మొదటి కేసు కర్ణాటకలోని చిత్రదుర్గలో నమోదవగా.. ఒక్కసారిగా కలకలం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన 54 ఏళ్ల రోగికి స్కిన్ మ్యూకోయిడ్ మైకోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. 
 
దేశంలో తొలి స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు ఇదేనని పేర్కొన్నారు. బాధితుడు నెల రోజుల కిందట కరోనా బారినపడి కోలుకున్నాడు. బాధితుడికి మధుమేహం సైతం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ శస్త్రచికిత్స ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించగా.. ఇప్పుడు రెండో దశ శస్త్ర చికిత్సకు సిద్ధమవుతున్నట్లు వైద్యులు వివరించారు.