శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 మే 2021 (10:39 IST)

హనుమంతుడి జన్మస్థలంపై చర్చకు సిద్ధమైన తితిదే...

హనుమంతుడి జన్మస్థలం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం హనుమంతుడి జన్మస్థలంపై ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. దీనిపై కర్ణాటకలోని కిష్కింధ హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హనుమంతుడి జన్మస్థలంపై ఆయనతో చర్చకు టీటీడీ సిద్ధమైంది. 
 
ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్న గోవిందానంద సరస్వతి... మంగళ, బుధవారాల్లో శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం టీటీడీ ఎస్వీ వేదాధ్యయన ప్రాజెక్ట్‌ అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ ఆయనను కలసి చర్చకు ఆహ్వానించారు. తిరుమల అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం అంటూ టీటీడీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలో హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి టీటీడీ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు లేఖలు రాశారు. హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలోనే చర్చకు వస్తామంటూ గోవిందానంద సరస్వతి తన చివరి లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.
 
ఈ క్రమంలో గురువారం తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో టీటీడీ పండిత బృందం తమ వద్దనున్న ఆధారాలు బయటపెట్టి హనుమంతుడి జన్మస్థలంపై గోవిందానంద సరస్వతితో చర్చించనున్నారు. ఇందులో పలువురు పండితులు పాల్గొనున్నారు.